సియోల్: ఉత్తర కొరియా (North Korea) నిరాటంకంగా అణ్వాయుధాలను (Nuclear Weapons) అభివృద్ధి చేస్తున్నదని, అణు విచ్ఛిత్తి పదార్థాన్ని ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. తాము హెచ్చరించినప్పటికీ 2023లోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉన్నదని తాజాగా విడుదలైన ఐరాస నివేదిక (United Nations report) పేర్కొంది. న్యూక్లియర్ (Nuclear), బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు (Ballistic Missile Programs) నిధులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉత్తర కొరియా తప్పించుకుందని అందులో పేర్కొన్నది.
తన అణుక్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకోవడానికి ఉత్తర కొరియా సైబర్ దాడులను (Cyber thefts) ఉపయోగిస్తోందని గతంలో యూఎన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా క్రిప్టో కరెన్సీ (Cryptocurrency), ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర ఫైనాన్షియల్ ఎక్స్చేంజీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడిందని, తద్వారా 2022లో 1.7 బిలియన్ల అమెరికన్ డాలర్లను సమూర్జించినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కాగా, గురువారం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un).. మిలిటరీ టాప్ జనరల్, జనరల్ స్టాఫ్ చీఫ్ పాక్ సుఇల్ను తొలగించారు. ఆయన స్థానంలో రక్షణ మంత్రి జనరల్ రి యోంగ్ గిల్ను నియమించారు. దీంతోపాటు యుద్ధం వచ్చే అవకాశం ఉందని, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు దేశ అధికారిక మీడియా వెల్లడించింది.