సియోల్: అంతర్జాతీయ ఆంక్షలు, హెచ్చరికలను లెక్కచేయకుండా ఉత్తరకొరియా (North Korea) తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉన్నది. ఈ నెల 4న బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన కిమ్ సర్కార్.. వారం వ్యవధిలోనే మరో రెండు క్రూయిజ్ మిస్సైల్స్ను విజయవంతంగా పరీక్షించింది. దేశ వ్యూహాత్మక అణుదాడి సామర్థ్యాన్ని చాటుతూ.. దీర్ఘ శ్రేణి స్ట్రటజిక్ క్రూయిజ్ క్షిపణులను రెండింటిని ప్రయోగించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. దీంతో కొరియన్ ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరోసారి అధికయ్యాయి. ఉత్తరకొరియా మరోసారి అణు పరీక్షలు నిర్వహించనుందా నే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు క్రూయిజ్ క్షిపణులు నిర్ధేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని కొరియన్ సెంట్రల్ న్యూస్ఏజెన్సీ పేర్కొంది. అయితే ఆ లక్ష్యాలేమిటనే వియాన్ని తెలియజేయలేదు. రెండు మిస్సైల్స్ సముద్రం మీదుగా 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయని తెలిపింది.
ఈ నెల 4న ఉత్తకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా తూర్పు వైపున గుర్తుతెలియని బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ కోస్ట్గార్డ్ కూడా క్షిపణి ప్రయోగాన్ని ధ్రువీకరించింది. కాగా, దక్షిణకొరియా, అమెరికా, జపాన్తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంపై ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా వరుసగా క్షిపణులను పరీక్షిస్తున్నది.