వాషింగ్టన్ డీసీ: అమెరికాలో క్రైస్తవ మతస్థులు తగ్గుతున్నారు. నాస్తికులు, ఏ మతం స్వీకరించని వాళ్ల సంఖ్య అక్కడ క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని పివ్ రీసర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం ద్వారా తేల్చారు. ఆ స్టడీ ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో 29 శాతం మంది యువత ఏ మతానికి చెందనివారు ఉన్నారు. గడిచిన 14 ఏళ్లలో ఇది 16 శాతం పెరిగినట్లు సర్వే పేర్కొన్నది. శతాబ్ధాలుగా అమెరికాలో శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థులు ఉండేవారు. అయితే అక్కడ ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో ఉన్నా.. ఆ మతాన్ని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా అనూహ్య రీతిలో క్రైస్తవ మతం క్షీణిస్తున్నట్లు పివ్ తన నివేదికలో చెప్పింది.
2007లో సుమారు 78 శాతం మంది అమెరికా యువత తాము క్రైస్తవులమని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 63 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు. అమెరికాలో ఏయే మతస్థులు ఉన్నారో తెలుసుకునేందుకు 2007లో పివ్ రీసర్చ్ సంస్థ తొలిసారి స్టడీ చేపట్టింది. నాస్తికులమని చెప్పుకునేవాళ్లు, ఏ మతంతో సంబంధం లేదని చెప్పేవారి డేటా కూడా ఆ స్టడీలో పొందుపరిచారు. అయితే గతంలో అయిదుగురిలో ఒకరు మాత్రమే వేరుగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు వేరన్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.
క్రిస్టియానిటీ ఎందుకు తగ్గుతుందో పరిశోధకులు తమ స్టడీలో పేర్కొన్నలేదు. కానీ పశ్చిమ దేశాల్లో ఎక్కువ శాతం క్రైస్తవ మతం ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లు అంచనా వేస్తున్నారు. 2019 సర్వేలో ఎక్కువ శాతం యువత మాత్రమే తాము ఏ మతానికి చెందమని చెప్పినట్లు తెలిసింది. మతాన్నీ వీడుతున్న వారిలో ఎక్కువగా ప్రొటెస్టాంట్ క్రైస్తవులు ఉన్నారని, క్యాథలిక్ క్రైస్తవుల్లో పెద్దగా మార్పేమీ లేదని స్టడీలో తేల్చారు. నాలుగు వేల మందిని సర్వే చేసిన తర్వాత ఆ ఫలితాలను రిలీజ్ చేశారు.