స్టాకోహోమ్, అక్టోబర్ 3: భౌతికశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. ఫెర్రి అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యులియర్ సంయుక్తంగా భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ను అందుకోనున్నారు. అణువు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్ డైనమిక్స్లపై పరిశోధనలు చేసేందుకు కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే పద్ధతిని అభివృద్ధి చేసినందుకు గానూ వారు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్లపై అధ్యయనం చేసేందుకు పరిశోధకులు సరికొత్త పరికరాన్ని ప్రపంచానికి అందజేశారని అకాడమీ తెలిపింది.
భౌతికశాస్త్రంలో ఐదో మహిళకు పురస్కారం…
ఫెర్రి అగోస్తిని (ఓహియో స్టేట్ యూనివర్సిటీ, అమెరికా), ఫెరెన్స్ క్రౌజ్ (లాడ్వింగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్,జర్మనీ), అన్నె ఎల్ హ్యులియర్ (ల్యూండ్ యూనివర్సిటీ, స్వీడన్) ఆటోసెకండ్పై పరిశోధనలు చేశారు. హ్యులియర్ భౌతికశాస్త్రంలో నోబెల్ అందుకుంటున్న ఐదో మహిళ కావడం విశేషం. ఈ ముగ్గురు నోబెల్ పురస్కారంతో పాటు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్, బంగారు పతకం అందుకోనున్నారు. డిసెంబర్ 10న స్టాక్హోమ్లో ఈ అవార్డును అందజేస్తారు. గతేడాది కూడా ముగ్గురు పరిశోధకులు భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు.
ఏమిటీ ఆటోసెకండ్?
ఆటోసెకండ్ అనేది సంక్షిప్త సమయం. ఇది సెకనులో ఒక క్వింటిలియన్ వంతుకు (10 టు ది పవర్ ఆఫ్ 18 సెకండ్స్) సమానం. విశ్వాన్ని నియంత్రించే ప్రాథమిక శక్తులు (ఫండమెంట్ ఫోర్సెస్) గురించి తెలుసుకునేందుకు ఉపయోగించే అనంతమైన సంక్షిప్త సమయమే ఆటోసెకండ్. ఆటోసెకండ్ పల్స్ను అతి తీవ్రత గల లేజర్ వ్యవస్థను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు. పరమాణు, పరమాణు భౌతికశాస్త్రంలో వీటిని విరివిగా వినియోగిస్తారు. ఆటోసెకండ్ పల్స్తో ఇప్పటివరకు మన కంటికి కనిపించని అనేక ప్రక్రియలను చూసే వీలు కలిగింది. ఎలక్ట్రాన్ల క్వాంటమ్ మెకానికల్ స్వభావం, రసాయనిక ప్రతిచర్యల సమయంలో ఒకదానితో మరొకటి సంకర్షణ జరుగుతున్నప్పుడు జరిగే మార్పులను దీని ద్వారా గమనించవచ్చు. ఆటోసెకండ్ పల్స్లను ఉపయోగించి ఎలక్ట్రాన్లను స్తంభింపజేయవచ్చు. ఆటోసెకండ్ పరిమాణ సమయంలో అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల డైనమిక్స్ను సంగ్రహించవచ్చు. ఆటోసెకండ్ సైన్స్ను ఉపయోగించి అతి నీలలోహిత (ఎక్స్యూవీ), ఎక్స్రే కిరణాలను సృష్టింవచ్చు.