స్టాక్హోమ్, అక్టోబర్ 4: మానవ శరీరంలో ఉష్ణ, స్పర్శ గ్రాహకాలపై చేసిన పరిశోధనలకు గాను ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ వైద్య బహుమతి లభించింది. శాస్త్రవేత్తల పేర్లు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పాటపుషాన్. వీరిద్దరూ శరీర గ్రాహకాలు ఎలా పనిచేస్తాయన్న దానిపై విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. ఎండ, వేడి తగిలినప్పుడు, గాలి వీచినప్పుడు, ఒత్తిడి కలిగినప్పుడు, శబ్దం వచ్చినప్పుడు శరీరంలోని గ్రాహకాలైన చర్మం, కండ్లు, చెవులు ఏ విధంగా స్పందిస్తాయి.. మిగతా కణజాలాలకు, మెదడుకు ఏ విధంగా సమాచారం చేరవేస్తాయి.. అన్న అంశాన్ని స్పష్టంగా వివరించారు. అందుకుగాను ఈ ఏడాది నోబెల్ వైద్య బహుమతికి ఎంపికయ్యారు. జూలియస్ న్యూయార్క్లో జన్మించారు. ప్రస్తుతం శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా వర్సిటీలో పనిచేస్తున్నారు. పాటపుషాన్ లెబనాన్లో జన్మించారు. కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా భిన్న రంగాల్లో ఈ బహుమతిని ప్రతీ ఏడాది ప్రకటిస్తున్నారు. డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పాటపుషాన్ గతేడాది కూడా న్యూరో సైన్స్లో ప్రతిష్ఠాత్మక కావ్లీ పురస్కారాన్ని సంయుక్తంగా గెలుచుకొన్నారు. గతేడాది హెపటైటిస్ సీ వైరస్పై పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ వైద్య బహుమతి లభించింది.
ప్రకృతి రహస్యాన్ని ఛేదించారు
జూలియస్(65) మిరపలో ఉండే క్యాప్సైసిన్ను ఉపయోగించి.. వేడి తగిలినప్పుడు నరాలు ఎలా ఉత్తేజితం అవుతాయన్నదానిపై పరిశోధనలు చేశారు. కణజాలాలపై ఒత్తిడిని గుర్తించేందుకు వాటిలో ఉండే ప్రత్యేకమైన సెన్సర్లను పాటపుషన్ గుర్తించారు. ‘ఈ ఇద్దరు శాస్త్రవేత్తల పరిశోధనలు ప్రకృతి రహస్యాన్ని ఛేదించాయి’ అని నోబెట్ కమిటీ సెక్రెటరీ జనరల్ థామస్ పెరల్మన్ వ్యాఖ్యానించారు. వీరి పరిశోధనలు కండరాల నొప్పి, ముఖ్యంగా గుండె జబ్బుల విషయంలో మరింత మెరుగైన చికిత్స విధానాలకు అవకాశం కల్పిస్తాయని భావిస్తున్నారు. నోబెల్ బహుమతి కింద బంగారు పతకం, రూ.8.46 కోట్ల నగదు (1.4 మిలియన్ డాలర్లు) లభిస్తాయి.