ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ (83)కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఆయన కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైందని తెలిపింది. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం ఇదం తా రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపిస్తున్నారు. పేదరికానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి యూనస్ 2006లో నోబెల్ పురస్కారాన్ని పొందారు. 1983లో ఆయన గ్రామీణ బ్యాంకును స్థాపించారు.
దీని ద్వారా స్వల్ప మొత్తాల్లో అప్పులు ఇచ్చారు. దీంతో బంగ్లాదేశ్కు మంచి పేరు వచ్చింది. ఆయన ఏర్పాటు చేసిన సంస్థల్లో గ్రామీణ టెలికం ఒకటి. ఈ కంపెనీకి ఆయన చైర్మన్. ఆయనతోపాటు ఆయన సహచరులు ముగ్గురు ఈ కంపెనీలో కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదని, వీరు కార్మిక చట్టాలను ఉల్లంఘించారని రుజువైనట్లు థర్డ్ లేబర్ కోర్టు తీర్పు చెప్పింది. వీరికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి 227.82 డాలర్ల చొప్పున జరిమానా విధించింది. వీరందరికీ ఒక నెలపాటు బెయిలు మంజూరు చేసింది.