టెహ్రాన్, డిసెంబర్ 4: ఇరాన్లో రెండు నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ఆ దేశ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. పోలీస్ కస్టడీలో మహ్సా అమిని మరణానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నైతిక పోలీస్ విభాగం (మోరాలిటీ పోలీస్)ను రద్దు చేసింది. ఈ మేరకు అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ ఆదివారం ప్రకటన చేశారు. అటు.. దేశంలో దశాబ్దాలుగా అమలవుతున్న హిజాబ్ చట్టంపై సమీక్ష చేసేందుకు నిర్ణయం తీసుకొన్నది. హిజాబ్ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదా? అనే దానిపై పార్లమెంట్, న్యాయవ్యవస్థ సమాలోచనలు చేస్తున్నాయని మహ్మద్ జాఫర్ వెల్లడించారు. సమీక్ష బృందం బుధవారం పార్లమెంట్ సాంస్కృతిక కమిషన్ను కలుస్తుందని, ఒకటి రెండు వారాల్లో ఫలితాన్ని చూస్తామని అన్నారు.
దేశవ్యాప్తంగా భగ్గుమన్న ఆందోళనలు
మహ్సా అమిని అనే 22 ఏండ్ల యువతి హిజాబ్ను సరిగ్గా ధరించకుండా మహిళల డ్రెస్కోడ్ను ఉల్లంఘించిందని సెప్టెంబర్ 16న ఆమెను నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అమిని పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు భగ్గుమన్నాయి. వేల సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించారు. రాజధాని టెహ్రాన్తో సహా దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా సాగాయి. ఆందోళనల్లో మహిళలు పలు మార్గాల్లో తమ నిరసనలు తెలిపారు. జుట్టు కత్తిరించుకోవడంతో పాటు హిజాబ్లను దహనం చేశారు. ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులు, సైన్యాన్ని ప్రయోగించింది. దీంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణలు, కాల్పుల్లో 450 మందికి పౌరులు, 60 మంది వరకు భద్రతా బలగాలు మరణించారని హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు.
ఏమిటీ నైతిక పోలీస్ విభాగం?
ఇరాన్లో షరియా చట్టం ప్రకారం ఏడేండ్లు దాటిన బాలికలు, మహిళలు తప్పనిసరిగా తలపై జుట్టు అంతా కప్పి ఉంచేలా హిజాబ్ ధరించాలి. హిజాబ్ చట్టం అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 2005లో నైతిక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. డ్రెస్ కోడ్ను ఉల్లంఘించే వారిని అరెస్టు చేసే అధికారం ఇచ్చారు. పౌరులు ఇస్లామిక్ నైతిక విలువలు పాటించేలా చూడటం, హిజాబ్ ధరించని వారిపై చర్యలు తీసుకోవడం వంటి విధులు అప్పగించారు.