వెల్లింగ్టన్: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో న్యూజిలాండ్( New Zealand ) ప్రపంచ దేశాలన్నింటి కంటే ముందు ఉంది. ఆరు నెలల కిందటే దేశం కరోనాను జయించిందంటూ ఆక్లాండ్లో 50 వేల మందితో పెద్ద ఎత్తున సంబురాలు కూడా చేసుకుంది. అయితే ఈ మధ్యే ఆరు నెలల తర్వాత ఆక్లాండ్లో మరో కరోనా కేసు నమోదవడంతో ఆ దేశం ఉలిక్కి పడింది. ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మూడు రోజుల లాక్డౌన్ విధించారు. ఇన్ని రోజులూ అసలు ఈ కేసు ఎలా వచ్చిందన్నదానిపై విచారణ జరిపిన ఆ దేశం.. మొత్తానికి మిస్టరీని ఛేదించినట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో శరవేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ ఆ వ్యక్తికి సోకింది. అతడు ఈ నెల 7న సిడ్నీ నుంచి ఆక్లాండ్ వచ్చాడు.
సిడ్నీలోనే అతనికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఆక్లాండ్ వచ్చిన రెండు రోజుల తర్వాత పాజిటివ్గా తేలగా.. వారం తర్వాత హాస్పిటల్లో చేరాడు. సిడ్నీ నుంచి వచ్చినప్పటి నుంచీ ఆ వ్యక్తి క్వారంటైన్లో, హాస్పిట్లోనే ఉన్నాడని ప్రధాని జెసిండా వెల్లడించారు. తాము భయపడినట్లు వైరస్ కమ్యూనిటీలోకి ప్రవేశించలేదన్న హామీ ఇచ్చారు. వైరస్ ఎలా వచ్చిందన్నది తెలుసుకోవడం వల్ల దానిని మరింత సమర్థంగా కట్టడి చేయొచ్చని ఆమె చెప్పారు. ప్రస్తుతం న్యూజిలాండ్లో 21 కరోనా కేసులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయిన న్యూజిలాండర్లను తిరిగి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన విమానంలో ఆ కరోనా సోకిన వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు.