Social Media | న్యూయార్క్: చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్మీడియా ఓ భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ (ఎక్స్), యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధులకు వరకూ అధికంగా వినియోగిస్తున్నారు. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నదని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. వీటిని పరిగణనలోకి తీసుకొన్న అమెరికాలోని న్యూయార్క్ సోషల్ మీడియాను పొగాకు, గన్స్లాగా ప్రజారోగ్యానికి ప్రమాదకరం, పర్యావరణ విషం అని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోషల్ మీడియా వాడకంపై మార్గదర్శకాలు కూడా జారీచేశారు. టిక్టాక్, యూట్యూబ్, ఫేస్బుక్ వాడకంతో పిల్లల్లో మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక మాధ్యమం వినియోగంపై మార్గదర్శకాలు జారీచేసిన తొలి అమెరికన్ నగరంగా న్యూయార్క్ నిలిచింది.
సోషల్ మీడియాను రోజులో ఎక్కువసేపు వినియోగిస్తుండటంతో పిల్లల్లో డిప్రెషన్ స్థాయిలు దశాబ్దంలోనే గరిష్ఠ స్థాయిని తాకినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. వారాంతాల్లో 77 శాతం మంది హైస్కూల్ విద్యార్థులు హోంవర్క్ను వదిలేసి రోజులో మూడు లేదా అంతకంటే ఎక్కువ గంటలసేపు స్క్రీన్కు అతుక్కుపోతున్నట్టు గుర్తించారు. సోషల్ మీడియా విపరీత వినియోగం ప్రజారోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నదని న్యూయా ర్క్ నగర డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ తేల్చింది.
సోషల్మీడియా వాడకంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు పరిమితి విధించాలని ఆడమ్స్ మార్గదర్శకాల్లో సూచించారు. టీనేజర్లు ఆన్లైన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్లను ఆపేస్తూ.. మానసిక ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు. టిక్టాక్, యూట్యూబ్ ఫేస్బుక్లాంటి సోషల్మీడియా ప్లాట్ఫాంలు పిల్లలను వ్యసనపరులుగా మార్చేలా ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చి, పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయని తెలిపారు. తమ నగర టీనేజర్లను వీటికి బానిసలుగా మారకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్టు చెప్పారు.