లండన్ : బ్రిటన్ ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న భారత సంతతి ఎంపీ రిషి సునాక్ ఎన్నికల ఫలితాల అనంతరం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక సంక్షోభం చుట్టుముడుతుందనే భయాల నడుమ ఆర్ధిక స్ధిరత్వం, ఐక్యత తన ప్రాధాన్యాలని స్పష్టం చేశారు. తాను ఎంతో రుణపడి ఉన్న దేశానికి తాను చేయాల్సిన పనులు చేపట్టడానికి ఇది తన జీవితంలో దక్కిన గొప్ప అవకాశమని కన్జర్వేటివ్ పార్టీ నేత పేర్కొన్నారు.
42 ఏండ్ల రిషి సునాక్ అత్యున్నత పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడు, హిందువు కావడం గమనార్హం. లండన్ పార్లమెంట్ సమీపంలోని కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి సునాక్ ప్రసంగించారు. మనం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించి మన పిల్లలు, రాబోయే తరాలను సుసంపన్నం చేసేందుకు, మెరుగైన భవిష్యత్ అందించేందుకు మనకు స్ధిరత్వం, ఐక్యత అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీని, దేశాన్ని ఏకతాటిపై ముందుకు నడపడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు.
బ్రిటిష్ పౌరులకు మెరుగైన సేవలందించేందుకు సమగ్రత, అంకితభావంతో కష్టపడి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 357 మంది ఎంపీల్లో సగానికి పైగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ వెన్నంటి నిలిచారు. ఇక గతంలోనూ బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ నిలిచినా లిజ్ ట్రస్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. గత వారం నాటకీయ పరిణామాల మధ్య ప్రధాని పదవి నుంచి ఆమె తప్పుకోవడంతో రిషి సునాక్ ఎన్నికకు మార్గం సుగమమైంది.