వాషింగ్టన్, జనవరి 23: అంగారక గ్రహం మీదకు వేగంగా చేరుకునేలా కొత్త సాంకేతికతను నాసా వినియోగించనుంది. ప్రస్తుతం గంటకు 39,600 కిలోమీటర్ల వేగంతో అంగారక గ్రహం మీదకు చేరుకోవాలంటే అంతరిక్షనౌకకు దాదాపు ఏడు నెలలు పడుతున్నది. న్యూక్లియర్ థర్మల్ అండ్ న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్(ఎన్టీఎన్ఈపీ) అనే సాంకేతికతను వినియోగిస్తే ఈ ప్రయాణ సమయాన్ని 45 రోజులకు తగ్గించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు నాసాకు ప్రతిపాదించారు.
నాసా ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్(ఎన్ఐఏసీ) కింద అంగారక యాత్రలో ఈ కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టనుంది. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గానూ నాసా దాదాపు రూ.10 లక్షలు కేటాయించింది. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చి అంగారక యాత్ర ప్రయాణ సమయం తగ్గితే యాత్ర ఖర్చు భారీగా తగ్గుతుందని, ఇంకా అనేక సవాళ్లకు ఇది పరిష్కారం చూపుతుందని నాసా అంచనా వేస్తున్నది.