మెల్బోర్న్, అక్టోబర్ 6: నలభై ఏండ్లు దాటితే మెల్లిమెల్లిగా పార్కిన్సన్ వ్యాధి శరీరమంతా వ్యాపిస్తున్నది. తల, చేతులు, కాళ్లు అన్న తేడా లేకుండా అవయవాలు వణుకుడుకు గురవుతున్నాయి. 60 ఏండ్లు వచ్చేసరికి వంగి నడవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే సమస్యను అరికట్టే అవకాశాలుంటాయి. కానీ, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి చాప కింద నీరులా శరీరమంతా వ్యాపిస్తున్న ఈ వ్యాధిని ఆరంభంలోనే గుర్తించటం సాధ్యం కావటం లేదు.
ఈ సమస్యను అధిగమించే దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఎలాంటి స్కానింగ్ల అవసరం లేకుండానే మాట ద్వారానే వ్యాధిని గుర్తించే యాప్ను ఎంఆర్ఐటీ యూనివర్సిటీ అభివృద్ధి చేశారు. ఈ యాప్ ఓపెన్ చేసి ఏ, ఓ, ఎమ్ అక్షరాలను పలికితే.. ఆ ధ్వనిలో తేడాలను గుర్తించి, వ్యాధి ఉన్నదా? లేదా? అన్నది చెప్తుంది. పార్కిన్సన్తో పాటు కరోనా తీవ్రతను కూడా గుర్తించేలా ఈ యాప్ను రూపొందించారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఐఈఈఈ జర్నల్ ఆఫ్ ట్రాన్స్లొకేషన్ ఇంజినీరింగ్ ఇన్ హెల్త్ అండ్ మెడిసిన్లో ప్రచురించారు.