Netanyahu : ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఘాటుగా స్పందించారు. శనివారం డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన దాడులను తిప్పికొట్టామని ఆయన చెప్పారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్ భేటీకి వెళ్లే ముందు నెతన్యాహు మాట్లాడారు. ఇరాన్ దాడులను తాము సమర్థంగా అడ్డుకున్నామని, తమ దేశంపైకి పంపిన డ్రోన్లను కూల్చేశామని, తాము కలిసికట్టుగా గెలుస్తామని వ్యాఖ్యానించారు.
‘మేం అడ్డుకున్నాం. కూల్చివేశాం. కలిసికట్టుగా గెలుస్తాం’ అని నెతన్యాహు అన్నారు. ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లను అమెరికా, బ్రిటన్ సహకారంతో కూల్చివేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఏ క్షణమైనా ప్రత్యక్ష దాడులకు దిగవచ్చు అనే విషయాన్న పసిగట్టి తాము కొన్నేళ్లుగా సిద్ధమవుతున్నామని చెప్పారు. మా రక్షణ వ్యవస్థను విస్తరించామని తెలిపారు.
‘ఇరాన్ ఏ క్షణమైనా ప్రత్యక్ష దాడులకు పాల్పడవచ్చనే ఉద్దేశంతో మేం ఆ దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధమై ఉన్నాం. ఇటీవల మా సన్నద్ధతను మరింత తీవ్రం చేశాం. మా రక్షణ వ్యవస్థను విస్తరించాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం. ఇప్పుడు ఇజ్రాయెల్ బలంగా ఉంది. ఇజ్రాయెల్ సైన్యం బలంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు బలంగా ఉన్నారు’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. తమకు హాని తలపెట్టే వారికి తాము తిరిగి హాని చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు.
కాగా శనివారం అర్ధరాత్రి ఇరాన్.. ఇజ్రాయెల్పై వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో దాడులు జరిపింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు మరణించారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగింది.