ఖాట్మండు: నేపాల్ ప్రధానిగా మళ్లీ కేపీ శర్మ ఓలి నియమితులయ్యారు. ప్రతిపక్షాలు నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో.. దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యుఎంఎల్) నేత ఓలిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ఆహ్వానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 30 రోజుల్లోగా సభలో బలం నిరూపించుకోవాలని సూచించారు.
మొత్తం 121 మంది సభ్యులున్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (యుఎంఎల్)లో ఓలి ప్రత్యర్థి గ్రూపు ఆయనకు మద్దతు ఇస్తుందా? అన్నది సందేహమే. నేపాలీ కాంగ్రెస్ నేత బహుదూర్ దోబా మావోయిస్టు పార్టీ నేత ప్రచండ మద్దతుతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. అయితే నేపాలీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే విషయంలో జనతా సమాజ్వాదీ పార్టీలో లుకలుకలు రావడంతో వెనక్కుతగ్గింది.
దాంతో దోబా తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఒక దశలో సీపీఎన్ (యుఎంఎల్) కు చెందిన మాధవ్ కుమార్ నేపాల్, ఉపేంద్ర యాదవ్, జేఎస్పీలోని బాబూరామ్ భట్టారారు గ్రూపు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు యత్నించినప్పటికీ తగినంత మెజారిటీ లభించకపోవడంతో వెనక్కుతగ్గారు.