ఖాట్మండు: పలుసార్లు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన నేపాలీ పర్వతాధిరోహకుడు మరణించాడు. మృతుడ్ని 38 ఏండ్ల నెగ్మి టెన్జీ షెర్పాగా గుర్తించారు. ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని ఖంబు మంచుపాతం వద్ద ఫుట్బాల్ మైదానంగా పిలిచే సురక్షిత ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఆయన మృతదేహాన్ని గుర్తించారు. నెగ్మి టెన్జీ మృతదేహాన్ని ఎవరెస్ట్ శిఖరం నుంచి కిందకు తరలించినట్లు అమెరికాకు చెందిన అంతర్జాతీయ పర్వత గైడ్ కంపెనీకి చెందిన ప్రతినిధి తెలిపారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరుగలేదని, ఎత్తుకు చేరినప్పుడు వాటిల్లే అనారోగ్యం కారణాలతో ఆయన చనిపోయి ఉండవచ్చన్నారు. క్యాంప్ 2కు సామాగ్రిని మోసుకెళ్తున్న షెర్పా ఎవరెస్ట్పై కూర్చొన్న స్థితిలో మరణించినట్లు తెలిపారు. ఆయన మరణం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ కంపెనీ పేర్కొంది. షెర్పా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది.
కాగా, ప్రపంచంలోని ఎత్తైన (8,848 మీటర్లు- 29,028 అడుగులు) ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో వందలాది మంది ప్రతి ఏటా ప్రయత్నిస్తుంటారు. అయితే వారి కలల సాకారానికి నేపాలీ గైడ్లు, పోర్టర్లు ఎంతో సహకరిస్తుంటారు. ప్రతి సాహసయాత్ర కోసం అవసరమైన టెంట్లు, ఆహారం, ఆక్సిజన్, తాగునీటి బాటిళ్లను ఎత్తైన శిబిరాలకు మోసుకెళ్లే క్రమంలో అనేక మంది ప్రమాదాలబారినపడి చనిపోతుంటారు. దీంతో ఎవరెస్ట్పై మరణించే వారిలో దాదాపు మూడోవంతు వీరే ఉంటారు.
మరోవైపు మంగళవారం 8,167 మీటర్ల (26,795 అడుగుల) ఎత్తైన ధౌలగిరిపై గ్రీకు అధిరోహకుడు, 59 ఏండ్ల ఆంటోనియోస్ సైకారిస్ మరణించాడు. ప్రపంచంలోని ఏడవ ఎత్తైన ఈ పర్వత శిఖరానికి చేరుకుని దిగుతుండగా అనారోగ్యానికి గురయ్యాడు. 7,400 మీటర్ల ఎత్తులో చనిపోయాడు. ఈ ఘటన అనంతరం తాజాగా నేపాలీ అధిరోహకుడు షెర్పా మరణించడంతో ఎవరెస్ట్ క్యాంప్లో విషాదం నెలకొన్నది.