ఖాట్మండు: నేపాల్ నూతన ప్రధానిగా మావోయిస్టు నాయకుడు పుష్పకమల్ దహల్ (ప్రచండ) నియమితులయ్యారు. నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆయనను నేపాల్ తదుపరి ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దాంతో ప్రచండ వరుసగా కాకపోయినా ముచ్చటగా మూడోసారి నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఇవాళ ఆరు పార్టీల నేతలు సమావేశమై ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఏకాభిప్రాయానికి రావడంతో నేపాల్లో అప్పటిదాకా నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ఆ సమావేశంలో పుష్పకమల్ దహల్ మొదటి రెండున్నరేండ్లు, సీపీఎన్-యూఎంఎల్ కూటమి తర్వాత రెండున్నరేండ్లు ప్రధాని పదవులు చేపట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
అనంతరం పుష్పకమల్ దహల్ అధ్యక్ష కార్యాలయంలో నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని కలిసి తన ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమోదం తెలుపాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అధ్యక్షురాలు ప్రచండ వినతిని ఆమోదిస్తూ ఆయనను ప్రధానిగా నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను వెలువరించారు.
కాగా, కొత్త సంకీర్ణంలో.. సీపీఎన్-యూఎంఎల్కు 78 మంది, మావోయిస్ట్ సెంటర్కు 32 మంది, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి 20 మంది, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి 14 మంది, జనతా సమాజ్వాది పార్టీకి 12 మంది, జనమత్ పార్టీకి ఆరుగురు, నాగరిక్ ఉన్ముక్త్ పార్టీకి నలుగురు ఎంపీల బలం ఉంది. దాంతో అధికార కూటమి మొత్తం ఎంపీల బలం 166గా ఉన్నది.