టోక్యో: న్యూ ఇయర్ రోజున జపాన్లో భారీ భూకంపం(Japan Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం వల్ల పెను నష్టమే జరిగింది. అయితే ఇప్పటి వరకు 242 మంది ఆచూకీ లేకుండాపోయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ బృందాలు సుమారు 72 గంటల పాటు తీవ్రంగా అన్వేషించారు. రెస్క్యూ ఆపరేషన్ గురువారం ముగిసిపోవడంతో.. 242 మంది ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభమైంది. సెల్ఫ్ డిఫెన్స్ దళాలు మిస్సైన వారి గురించి తీవ్రంగా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కూలిన ఇండ్ల కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సుజు, వాజిమా పట్టణాల్లో ఎక్కువగా ఇండ్లు కూలాయి. అక్కడ మిస్సైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
ఇప్పటికీ ఇంకా వేలాది ఇండ్లకు విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడడం, రోడ్లు బ్లాక్ కావడం వల్ల అనేక మంది దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. ప్రతి ఒక్కర్నీ గుర్తించే వరకు రెస్క్యూ ఆపరేషన్ ఆగదు అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. భూకంప బాధితుల కోసం ఈసారి బడ్జెట్లో 34 మిలియన్ల డాలర్లు కేటాయించినట్లు జపాన్ సర్కారు తెలిపింది.