ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై (Nawaz Sharif) అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్త దాడిచేశాడు. దీంతో షరీఫ్ బాడీగార్డు తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక మీడియా పేర్కొన్నది. దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడిన నేపథ్యంలో లండన్లో ఉన్న నవాజ్ షరీఫ్పై ఈ దాడి జరగడం గమనార్హం. నిందితుడికోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపింది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం ఓటింగ్ జరగనున్నది. ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప ఇమ్రాన్ ఓడిపోవడం, ప్రధాని పదవి నుంచి దిగిపోవడం దాదాపు ఖాయమే. ఇమ్రాన్ నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి మద్దతిస్తున్న రెండు పార్టీలు విపక్షాల కూటమిలో చేరడంతో ఇమ్రాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి.
342 మంది సభ్యులున్న పాక్ లోక్సభలో ఇమ్రాన్కు 172 మంది మద్దతు అవసరం. తమకు 175 మంది మద్దతు ఉందని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని విపక్ష కూటమి ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో లండన్లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై అధికార తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కార్యకర్త దాడికి పాల్పడటం విశేషం.