కేప్ కెనవరాల్, నవంబర్ 16: దాదాపు 50 ఏండ్ల తర్వాత చందమామపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరోసారి ప్రయాణం ప్రారంభించింది. ఆర్టెమిస్-1 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లేందుకు ముందస్తుగా బుధవారం కేప్ కెనవరాల్ నుంచి డమ్మీలతో ఓరియన్ క్యాప్సూల్ను ప్రయోగించింది. మూడు వారాలపాటు సాగే ఈ ప్రయోగంలో డమ్మీలను చంద్రుడి కక్ష్యలోకి వదిలి ఓరియన్ క్యాప్సూల్ తిరిగి భూమిని చేరుకోనున్నది. మూడు నెలలుగా ఈ ప్రయోగం వాయిదా పడుతూ వస్తున్నది. మొదట రాకెట్లో ఇంధనం లీకయ్యింది. ఆ తర్వాత హరికేన్ లాన్ వల్ల మరోసారి వాయిదా పడింది. ఎట్టకేలకు బుధవారం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 50 ఏండ్ల క్రితం అపోలో మిషన్ను ముగించిన తర్వాత చంద్రుడిపై నాసా దృష్టిపెట్టడం ఇదే తొలిసారి.
ఏమిటీ ఆర్టెమిస్-1?
చంద్రుడిపై ప్రయోగాలు, మనుషులను అక్కడ సుదీర్ఘ కాలం ఉంచడమే లక్ష్యంగా నాసా ఆర్టెమిస్ సిరీస్ (1,2,3) యాత్రలను చేపట్టనున్నది. దీన్ని అపోలో ప్రాజెక్టుకు అధునాత వెర్షన్గా చెబుతున్నారు. ఆర్టెమిస్ సిరీస్లో రెండు దశలు ఉన్నాయి. ఒకటి.. చంద్రుడిపై పరిశోధనలు కాగా, రెండోది మనుషులను జాబిలి మీదకు పంపి కాలనీలు నిర్మించడం.
ప్రయోగంలో ఏమేం పరీక్షిస్తారు?
ఆర్టెమిస్-1 యాత్రలో వ్యోమగాములను జాబిలి మీదకు పంపరు. కేవలం ఓరియన్ క్యాప్సుల్ను మాత్రమే పంపారు. చంద్రుడి ఉపరితలం నుంచి నీరు, ఇతర వనరులను సేకరించడం, రెండోదశలో పంపించే వ్యోమగాములపై రోదసిలోని రేడియేషన్ స్థాయిలు ఏ మేరకు ప్రభావం చూపొచ్చు తదితర విషయాలను ఈ ప్రయోగంలో విశ్లేషిస్తారు. ఇందుకోసం క్యాప్సుల్లోని కమాండర్ సీటులో మనిషిని పోలిన ఒక బొమ్మ, మరో రెండు బొమ్మలను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. మనిషి కణజాలాన్ని సిమ్యులేట్ చేసే పదార్థంతో వీటిని రూపొందించారు. చంద్రుడి చుట్టూ తిరిగి కీలక సమాచారాన్ని సేకరించి ఓరియన్ డిసెంబర్లో భూమికి తిరిగి చేరుతుంది. 2024లో ఆర్టెమిస్-2 (జాబిలి మీదకు వ్యోమగాములు), 2025లో ఆర్టెమిస్-3 (సాధారణ పౌరులు) ప్రయోగాలు జరుగనున్నాయి.
ఈ ప్రయోగం ఎందుకు ప్రత్యేకం?
సుమారు 50 ఏండ్ల కిందటే చంద్రుడి మీదకు మానవుడు అడుగుపెట్టాడు. అయితే, గతంలో చేసిన ప్రయోగాల్లో వ్యోమగాములు జాబిలిపై గరిష్ఠంగా మూడు రోజులకు మించి లేరు. కానీ ఆర్టెమిస్ సిరీస్ మిషన్లో పంపించాలనుకుంటున్న వ్యోమగాములు సుదీర్ఘకాలం చంద్రుడిపై ఉండనున్నారు. అందుకే మానవ చరిత్రలో ఇదో గొప్ప ప్రయోగంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఓరియన్ క్యాప్సుల్ను చంద్రుడి కక్ష్యలోకి తీసుకుపోయే ఎస్ఎల్ఎస్ రాకెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా నాసా చెబుతున్నది. అపోలో వ్యోమనౌకను మోసుకెళ్లిన శాటర్న్-5 రాకెట్ కంటే 15 శాతం ఎక్కువ శక్తిని కలిగి ఉన్నదని పేర్కొంటున్నది.