అఖండ విశ్వంలో మనిషి దృష్టికి చిక్కని ఎన్నో అద్భుతాలు ఉంటాయి. వాటిని చూసేందుకే మనం టెలిస్కోప్ కనిపెట్టాం. కానీ విశ్వంలో టెలిస్కోప్తో చూడగలిగే దూరం చాలా తక్కువ. అయితే ఇది మనిషి ఉత్సుకతను చిదిమేయలేకపోయింది. అందుకే ఒక్కోమెట్టూ ఎక్కుతూ మరింత శక్తిమంతమైన టెలిస్కోప్స్ తయారుచేస్తున్నాడు.
ఎలాగైనా అంతరిక్షంలోని అద్భుతాలను తన కళ్లతో చూడాలని ఆశపడుతున్నాడు. ఈ ఆశతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తయారు చేసిన కొత్త ప్రయోగం జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది అంతరిక్షంలోకి వెళ్లినప్పటి నుంచి రోదసిలోని ఎన్నో అద్భుతమైన విషయాలను చాలా స్పష్టంగా ఫొటోలు తీసి భూమ్మీదకు పంపుతోంది. ఇంతకుముందు శాస్త్రవేత్తలు పంపిన మిగతా టెలిస్కోపులన్నీ దీని ముందు దిగదుడుపే.
ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసిందీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. తాజాగా అంతరిక్షంలో రెండు నక్షత్రాల వేలిముద్రల వంటి చిత్రాన్ని క్లిక్ మనిపించింది. దీని గురించి నాసా పరిశోధకులు వివరిస్తూ.. అంతరిక్షంలో రెండు నక్షత్రాలు ప్రతి 8 ఏళ్లకోసారి కలుస్తాయని చెప్పారు. ఇవి కలిసే సమయంలో వాటిలో ఆ నక్షత్రాలు వెలువరించే వాయువులు ఢీకొని దుమ్ముకణాలు ఏర్పడతాయి.
అవే ఆ నక్షత్రాలు ఒకదాన్నొకటి దాటే వరకూ వాటి చుట్టూ వృత్తాలను ఏర్పరుస్తాయి. గతంలో అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్ వాడినా కూడా వీటిలో కేవలం 2 రింగ్స్ మాత్రమే కనిపించేవని సైంటిస్టులు చెప్పారు. అయితే జేమ్స్ వెబ్ పంపిన చిత్రంలో ఏకంగా 17 వరకూ ఈ సర్కిల్స్ కనిపిస్తుండటం విశేషం. ఈ నక్షత్రాల జంటను ‘వుల్ఫ్ రాయెట్ 140’ అని పిలుస్తారట.