వాషింగ్టన్, జూన్ 3: నిశీధి రాత్రుల్లో వెన్నెల అందాలకు తీసిపోని విధంగా మిలమిల మెరిసే శుక్ర కాంతులను ఎప్పుడైనా చూశారా? సౌర కుటుంబంలో భూమికి సహోదరుడిగా పిలిచే ఆ గ్రహ రహస్యాలను ఛేదించాలన్నది ప్రతి శాస్త్రవేత్త చిరకాల స్వప్నం. అయితే, ఉదయతార (శుక్రగ్రహం మరోపేరు) మీదున్న అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, కఠిన వాతావరణ పరిస్థితులు ఆ ప్రయత్నాలను సఫలంకానివ్వడంలేదు. అయితే, సంధ్యాతార (శుక్రగ్రహానికి మరోపేరు) రహస్యాలను ఎలాగైనా తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రెండు మిషన్లతో ఓ ప్రయోగానికి రూపకల్పన చేసింది.
ఏమిటీ ప్రయోగం
శుక్రగ్రహం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి 1992లో నాసా డిస్కవరీ ప్రొగ్రామ్ ఆఫ్ వీనస్ను రూపొందించింది. అయితే, అనివార్యకారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అయితే చైనా, రష్యా, జపాన్, భారత్ తదితర దేశాలు అంగారకుడు, చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్న తరుణంలో శుక్రగ్రహానికి సంబంధించిన కొత్త రహస్యాలను అందరికంటే ముందుగా ఛేదించేందుకు నాసా ఈ ప్రయోగాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. 2028-2030 మధ్యలో చేపట్టనున్న ఈ ప్రయోగానికి 100 కోట్ల డాలర్లు (రూ. 7,302 కోట్లు) ఖర్చు చేయనున్నారు.ఈ ప్రాజెక్టులో ప్రధానంగా రెండు మిషన్లు ఉన్నాయి. అవి..
డావిన్సీ+- శుక్రగ్రహం ఎలా ఏర్పడింది? అక్కడి వాతావరణం జడవాయువులతో ఎందుకు నిండి ఉన్నదన్న అంశాలను శోధిస్తుంది.వెరిటాస్-సూర్యునికి చేరువగా ఉండటంవల్లే శుక్రుడి ఉపరితలం వేడిగా ఉన్నదా? అక్కడి ఉపరితలం భూమికంటే ఎందుకు భిన్నంగా ఉన్నదన్న విషయాలు కనిపెడుతుంది.
ఎందుకు ఈ ప్రయోగం?
సౌరకుటుంబంలో అంగారకుడు, శుక్రుడు భూమికి అత్యంత చేరువలో ఉన్న గ్రహాలు. అంగారకుడు భూమికి 34 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటే, శుక్రగ్రహం భూమికి 24 కోట్ల కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అయితే, అంగారకుడిపై వాతావరణం భూవాతావరణానికి సారూప్యంగా ఉన్నప్పటికీ, శుక్రుడిపై వాతావరణం పూర్తి భిన్నంగా ఉన్నది. దీంతో శుక్రగ్రహంపై మనుషుల ఆవాసం సాధ్యపడట్లేదు. దీనికి గల శాస్త్రీయ కారణాలను విశ్లేషించేందుకు నాసా ప్రధానంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నది.
గతంలో ఎన్నో వైఫల్యాలు
శుక్రగ్రహం ఉపరితలంపై 470 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో ఇప్పటివరకూ ఏ మిషన్ కూడా అక్కడి ఉపరితలంమీద దిగలేదు. సోవియెట్ యూనియన్, జపాన్ పంపిన మిషన్లు ఎక్కువ కాలం పనిచేయలేదు. దీంతో విరుద్ధ పరిస్థితులు ఎదురైతే కక్ష్యలో నుంచే కార్యకలాపాలు సాగించేలా నాసా ఈ మిషన్లను రూపకల్పన చేస్తున్నది.
విశేషాలకు నెలవు
రాత్రిపూట ఆకాశంలో చంద్రుడి తర్వాత అత్యంత ప్రకాశవంతంగా మెరిసే గ్రహమే శుక్రగ్రహం. అక్కడి వాతావరణాన్ని దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో సూర్యకాంతి వాటిపై పడి పరావర్తనం చెందుతుంది. దీంతో శుక్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. పరిమాణంలో భూమికి సమానంగా ఉండటంతో ఈ గ్రహాన్ని భూమి సోదరుడిగా పిలుస్తారు. భూమిపై సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర దిక్కున అస్తమిస్తే.. శుక్రుడిపై పడమర దిక్కున ఉదయించి, తూర్పున అస్తమిస్తాడు. శుక్రుడు వ్యతిరేక ది శలో భ్రమణం చేయడం వల్లే ఇది జరుగుతున్నది. మన దగ్గర 243 రోజులు గడిస్తే, శుక్రుడిపై ఒక్కరోజు గడిచినట్టు.