వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలుసు కదా. ఈ టూర్లో భాగంగా ఆయన ప్రపంచ నేతలను కలుస్తున్నారు. అందులోభాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్లతో ఇప్పటికే మోదీ భేటీ అయ్యారు. శుక్రవారం ప్రెసిడెంట్ జో బైడెన్ను కూడా మోదీ కలవనున్నారు. అయితే వీళ్లందరి కోసం మోదీ ప్రత్యేకమైన బహుమతులను తీసుకెళ్లారు. కమలా హ్యారిస్ను కలిసిన సందర్భంగా ఆమెకు తన తాతకు సంబంధించిన పాత నోటిఫికేషన్ల కాపీని బహుమతిగా ఇచ్చారు. చేత్తో తయారుచేసిన ఓ వుడెన్ ఫ్రేమ్లో పెట్టి వీటిని ఆమెకు అందించారు. కమలా తాత పేరు పీవీ గోపాలన్. ఆయన ఇండియాలో వివిధ ప్రభుత్వ సర్వీసుల్లో పని చేశారు.
ఈ వుడెన్ ఫ్రేమ్తోపాటు గులాబీ మీనాకరీ చెస్ సెట్ను కూడా కమలా హ్యారిస్కు మోదీ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ చెస్ సెట్ ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటైన కాశీలో తయారు కావడం విశేషం. ఈ చెస్ సెట్లోని ప్రతి భాగాన్ని చేత్తో తయారు చేశారు. ఇక ఆ తర్వాత క్వాడ్లో భాగమైన ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులను కూడా మోదీ కలిశారు. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్కు సిల్వర్ గులాబీ మీనాకరీ పడవను గిఫ్ట్గా ఇచ్చారు. ఇక జపాన్ ప్రధాని యోషిండె సుగకు గంధం చెక్కతో చేసిన బుద్ధుని విగ్రహాన్ని అందించారు.