నల్లగొండ ప్రతినిధి, జూలై 20 (నమస్తే తెలంగాణ): కమీషన్లు రావనే ఉద్దేశంతోనే సీఎం, మంత్రి ఉత్తమ్ కన్నెపల్లిపై కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే 150 టీఎంసీల నీరు వృథాగా ఏపీలోకి ప్రవహించిందని, ఇప్పటికైనా ప్రభుత్వం కన్నెపల్లి పంప్హౌస్ను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్కుమార్రెడ్డి ఈ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట అబద్ధపు మాటలు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ రూపొందించిన అధ్భుతమైన కాళేశ్వరం కరువు పరిస్థితుల్లో రాష్టాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించేందనని చెప్పారు. కన్నెపల్లి పంపుహౌస్ను ప్రారంభిస్తే ఏడు జిల్లాల్లో తాగు, సాగు నీటికి ఇబ్బంది ఉండదని తెలిపారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఏపీ సీం చంద్రబాబు కోసం తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మొండివైఖరితో తెలంగాణ ప్రజలు మంచినీళ్ల కోసం గోసపడే రోజులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణానదిలో నీటిని సైతం వాడుకోవడం చేతకాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే అడ్డుకోలేని దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. ఏడాది నుంచి సూపర్ ఎల్ నినో వస్తుందని పర్యావరణ వేత్తలు, అనేక సంస్థలు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని తెలిపారు.