నెపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఆరోగ్య కారణాల చేత కోర్టుకు రాలేకపోయినట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. వాహనాల్లో తిరిగి చాలా రోజులు అవుతున్న కారణంగా.. ఆరోగ్యం చాలా బలహీనంగా ఉందని న్యాయవాది చెప్పారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆ దేశాన్ని సైన్యం హస్తగతం చేసుకున్న తర్వాత.. 76 ఏళ్ల సూకీని పలు కేసులపై అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ఆంగ్సాన్ సూకీ గత 30 ఏళ్లలో ఎక్కువ శాతం జైలులోనే గడిపారు. సూకీ ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
తనకు కారులో ప్రయాణించే అలవాటు ఎక్కువగా లేదని, రెస్ట్ తీసుకోవాలని ఉందని సూకీ చెప్పినట్లు లాయర్ మిన్ మిన్ సోయి తెలిపారు. కేవలం న్యాయ బృందంతో మాత్రమే సూకీ దేశ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు. అక్రమంగా వాకీటాకీలను దిగుమతి చేశారని, కరోనా వైరస్ ఆంక్షలను ఉల్లఘించినట్లు సూకీపై ఆరోపణలు ఉన్నాయి. భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు కూడా ఆంగ్ సాన్ సూకీపై కేసు నమోదు అయ్యింది.