న్యూఢిల్లీ, మే 9: బయో మెడికల్ రంగంలో విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు సమర్పిస్తున్న ‘పరిశోధనా పత్రాల్లో’ ఉన్నదంతా నిజమేనా? అంటే కాదనే సమాధానం వస్తున్నది. కొన్ని తప్పుడు ప్రస్తావనలు, ఉల్లేఖనలు పేర్కొంటూ వైద్య పరిశోధనా పత్రాల్ని సమర్పిస్తున్నారన్న సంగతి తాజాగా వెలుగుచూసింది. జనవరి 2023 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య ప్రచురితమైన 25 లక్షల బయో మెడికల్ పత్రాల్ని ‘కొలంబియా వర్సిటీ’కి చెందిన సైంటిస్టులు విశ్లేషించారు.
‘ఏఐ ఆధారిత వ్యవస్థ’తో వాటిని పరిశీలించారు. ఈ 25 లక్షల అకడమిక్ పేపర్స్లో పేర్కొన్న 9.7 కోట్ల రిఫరెన్సెన్ను శాస్త్రవేత్తలు పలు రకాలుగా పరిశీలించగా, ఇందులో 4,046 రిఫరెన్సెస్ తప్పుడు ప్రస్తావనలుగా తేలాయి.
ఉనికి లేని తప్పుడు సమాచారం, ప్రస్తావనలు 2,810 పరిశోధనా పత్రాల్లో ఉన్నాయని కనుగొన్నారు. ఉదాహరణకు..ఒక పరిశోధనా వ్యాసంలో ‘ఏబీసీ నివేదిక ప్రకారం..’ అని రాసి ఉంటే, వాస్తవానికి అలాంటి నివేదిక ఏదీ లేకపోతే..దానిని తప్పుడు ప్రస్తావన లేదా ఉల్లేఖనం అవుతుంది. తమ పరిశోధనా పత్రంలో ఒక విషయాన్ని సమర్థించుకోవడానికి అసలు ఉనికిలో లేని సమాచారాన్ని నిజమైనవిగా చూపటం చేశారన్నమాట. ఈ సమస్య వైద్యశాస్త్రంపై నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని, వైద్య నిర్ణయాల్లో తప్పుడు సమాచారాన్ని ఉపయోగించడానికి దారి తీస్తుందని సైంటిస్టులు హెచ్చరించారు.