వాషింగ్టన్, ఆగస్టు 27: కరోనా మళ్లీ పంజా విసరడంతో అమెరికాలోని ఫ్లోరిడాలో పరిస్థితి దారుణంగా మారింది. కరోనాతో మరణించిన వ్యక్తుల మృతదేహాలను భద్రపరచడానికి దవాఖానల్లోని మార్చురీల్లో చోటు దొరకడం లేదు. కూలర్లను అద్దెకు తీసుకుని భద్రపరుస్తున్నట్టు ఫ్లోరిడాలోని అతి పెద్ద దవాఖాన ‘అడ్వెంట్హెల్త్’ తెలిపింది. కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానవాటికల సామర్థ్యం సరిపోవడం లేదు. దాంతో ఎక్కువ రోజులు మార్చురీల్లో ఉంచాల్సి వస్తున్నదని స్థానిక వార్తా ఛానళ్లు పేర్కొన్నాయి. మరోవైపు ఆక్సిజన్ కొరతతో మరణాల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన విధించడానికి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ విముఖత వ్యక్తం చేయడం విశేషం. గోరంతల్ని కొండంతలు చేసి చూపిస్తున్నారని ఆయన మొండిగా వాదిస్తున్నారు. కాగా, డెల్టా వేరియంట్ ప్రభావంతో అమెరికావ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం కరోనాతో హాస్పిటళ్లలో చేరినవారి సంఖ్య లక్ష దాటిపోయింది.