ఇస్లామాబాద్, అక్టోబర్ 8: అఫ్గానిస్థాన్లో శనివారం సంభవించిన భారీ భూకంప మృతుల సంఖ్య రెండు వేలు దాటింది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే కన్పిస్తున్నాయి. ఏ శిథిలాన్ని తొలగిస్తే ఎన్ని శవాలు బయటపడతాయోనని సహాయ బృందాలు భయపడుతున్నాయి. మృతుల సంఖ్య రెండు వేలు దాటినట్టు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రేయన్ ఆదివారం వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య దీనికన్నా ఎక్కువే ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.
గత రెండు దశాబ్దాలుగా అఫ్గాన్లో ఎన్నడూ ఇంత తీవ్ర భూకంపాన్ని చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. భూకంపానికి పలు గ్రామాలు నాశనమయ్యాయని, వందలాది మంది ప్రజలు శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారని, సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అధికారికంగా 2060 మంది మృతి చెందినట్టు తేలిందని, 1240 మంది గాయపడ్డారని, 1320 గృహాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్పారు. సుమారు డజన్ సహాయ బృందాలతో పాటు, మిలటరీ, రెడ్ క్రీసెంట్ లాంటి ఎన్జీవోలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయని చెప్పారు.
6.3 తీవ్రతతో శనివారం పశ్చిమ అఫ్గాన్లోని హెరాత్లో సంభవించిన భారీ భూకంపానికి భవనాలు పేకమేడల్లా కూలాయి. ఐదుసార్లు భూ ప్రకపంనలు రాగా, అందులో 6.3, 5.9, 5.5 తీవ్రతతో వచ్చిన భూకంపం తీవ్ర నష్టం కలిగించింది. ప్రకంపనల ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. కార్యాలయాలు, ఇళ్లలో ఉన్న పౌరులు భయంతో బయటకు పరుగులు తీశారు. పలువురు ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా ప్రాణాలు కోల్పోయారు.
పలు చోట్ల భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోవడంతో సహాయ బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. హెరాత్ నగరంలో శిథిలాలు, రాళ్ల కింద ఉన్న మృతదేహాలను, గాయపడిన వారిని పౌరులే తమ చేతులతో బయటకు తీస్తున్న దృశ్యాలు కన్పించాయి. కూలిన భవనంలో చెత్త మధ్య పీకలోతులో కూరుకుపోయి ఉన్న ఒక చిన్నారి బాలికను కొందరు స్థానికులు రక్షించారు. అదే సమయంలో వారికి ఒక చేయి కన్పించింది. ఆ చేయి ఆ బాలిక తల్లిదిగా భావిస్తున్నారు. అయితే ఆమె బతికున్నదీ లేనిదీ ఇంకా తెలియలేదు. వీటికి సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి.