మనీలా: ఫిలిప్పైన్స్లో సూపర్ టైఫూన్ బీభత్సం సృష్టించింది. బలమైన తుఫాను ధాటికి ఇప్పటికే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడు లక్షల మంది ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. టైఫూన్ రాయ్ ఆర్చిపెలాగోలోని దక్షిణ, మధ్య ప్రాంతాలను బాగా దెబ్బతీసింది. తుఫాను బీభత్సానికి పలు ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. కరెంటు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ ప్రసారం నిలిచిపోయింది. కొన్నిచోట్ల ఇండ్ల పైకప్పులు కూలిపోయాయి. పలు ఆస్పత్రులు కూడా ఈ తుఫాను ధాటికి దెబ్బతిన్నాయి.
ఎడతెరపి లేని వర్షం కారణంగా భారీ వరదలు పోటెత్తాయి. దాంతో పలు గ్రామాలు నీట మునిగాయి. కాగా, ఫిలిప్పీన్స్లో గత కొన్ని సంవత్సరాల్లో ఇదే అత్యంత హేయమైన తుఫాను అని అధికారులు తెలిపారు. రాయ్ టైఫూన్ గత గురువారం గంటకు 195 కిలోమీటర్ల వేగంతో ఫిలిప్పీన్స్ తీరాన్ని తాకింది. కాగా, ప్రస్తుతం ఫిలిప్పీన్స్లో రక్షణ సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. మిలిటరీ, పోలీస్, కోస్ట్గార్డ్ సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.