Intuitive Machines | వాషింగ్టన్, ఫిబ్రవరి 23: చంద్రుడి ఉపరితలంపై తొలిసారిగా ఒక ప్రైవేటు ల్యాండర్ అడుగు పెట్టి చరిత్ర సృష్టించింది. అంతరిక్ష యాత్రల వాణిజ్యీకరణలో భాగంగా అమెరికాకు చెందిన ‘ఇన్ట్యూటివ్ మెషీన్స్’ అనే ప్రైవేటు సంస్థ ఈ ప్రయోగం చేపట్టింది. హ్యూస్టన్ కేంద్రంగా పనిచేసే ఇన్ట్యూటివ్ మెషీన్స్ కంపెనీ రూపొందించిన ‘ఒడిస్సెస్’ గురువారం సాయంత్రం 6.23 గంటలకు చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండ్ అయిందని పేర్కొన్నారు. నాసా 1972లో చేపట్టిన అపోలో-17 మిషన్ దాదాపు 50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై కాలుమోపిన తొలి అమెరికా అంతరిక్ష నౌక ఇదే కావడం గమనార్హం. ‘ఒడిస్సెస్’ ద్వారా అమెరికా తిరిగి చంద్రుడిపై అడుగు పెట్టిందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సంతోషం వ్యక్తం చేశారు.
అయితే ఊహించినట్టుగానే ‘ఒడిస్సెస్’ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత మొదటగా శాస్త్రవేత్తలకు దానితో సంబంధాలు తెగిపోయాయని ఎన్బీసీ న్యూస్ నివేదించింది. అనంతరం సమస్యను పరిష్కరించిన శాస్త్రవేత్తలు.. ల్యాండర్ సక్రమంగానే పనిచేస్తూ డాటా పంపడం ప్రారంభించిందని తెలిపారు.
ఒడిస్సెస్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ఏడు రోజుల పాటు సేవలు అందించనున్నది. ఒడిస్సెస్ ల్యాండ్ అయిన ప్రాంతంలో చీకటి పడేందుకు మరో వారం మాత్రమే సమయం ఉన్నదని ఏబీసీ న్యూస్ పేర్కొన్నది.