మాస్కో: ఇరాన్ సుప్రీం నేతగా మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) ఎన్నికైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన నేపథ్యంలో కొత్త నేతను ఎన్నుకున్నారు. అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తాబా ఆ రోజు జరిగిన దాడిలో గాయపడినట్లు తెలిసిందే. అయితే మొజ్తాబాకు ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో వైద్య చికిత్స జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కువైట్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వెలుబడ్డాయి. ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ చికిత్స కోసం మాస్కో చేరుకున్నట్లు కువైట్ మీడియా వెల్లడించింది. అయితే క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ వార్తలపై ఎటువంటి కన్ఫర్మేషన్ కానీ ఖండన కానీ చేయలేదు. ఇలాంటి వార్తలపై తాము ఎప్పుడూ కామెంట్ చేయబోమని ఆయన అన్నారు. తమ వైమానిక దాడిలో మొజ్తాబాకు గాయాలయ్యాయని కొన్ని రోజుల క్రితం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరో వైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. తమ సైనిక బలగాలను ఖర్గ్ దీవికి పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఖర్గ్ దీవిలో ఉన్న ఇరానీ మిలిటరీ కేంద్రాలను అమెరికా వైమానిక దళాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ చమురు సరఫరాకు కీలకమైన టర్మినల్గా ఖర్గ్ దీవి వ్యవహరిస్తోంది. అయితే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఆ దీవిపై దాడి చేశారు. ఆ దీవి నుంచి ఇరాన్ సుమాఉ 90 శాతం ఇంధనాన్ని ఎగుమతి చేస్తుంది. ఒకవేళ ఖర్గ్ దీవికి అమెరికా తన బలగాలను పంపిస్తే, అప్పుడు గల్ఫ్ పరిస్థితులు మరింత భీకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు ఇరాన్ మరింత విస్తృతంగా అమెరికాకు సంబంధం ఉన్న ఆయిల్ కంపెనీలపై దాడి చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.