బ్యాంకాక్: ఒక పెంపుడు పిల్లిని కొండచిలువ మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న ఒక బాలిక కన్నీరుమున్నీరైంది. థాయిలాండ్కు చెందిన కంచి నార్డ్ కుటుంబం ఒక పిల్లిని పెంచుతున్నది. దానికి ‘హో జూన్’ అని పేరు పెట్టారు. ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటలకు అది కనిపించలేదు. పెంపుడు పిల్లి కోసం వెతికిన నార్డ్ కుమార్తెకు పెరడులో కొండచిలువ కనిపించింది. దానిని చూసి ఆ పాప భయాందోళన చెందింది. కొండచిలువ కడుపు ఉబ్బినట్లు ఉండటంతో తమ పెంపుడు పిల్లిని అది మింగి ఉంటుందని గ్రహించి కన్నీరుమున్నీరుగా ఆ చిన్నారి ఏడ్చింది.
మరోవైపు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించగా రెస్క్యూ బృందం వచ్చి ఆ కొండచిలువను బంధించి తీసుకెళ్లింది. కాగా, కొండచిలువ మింగిన తమ పెంపుడు పిల్లి ‘హో జూన్’ ఇక ఎప్పటికీ తిరిగి రాదని తెలిసి ఆ కుటుంబం తల్లడిల్లింది. ఆ బాలిక తల్లి ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తమ కుమార్తె ఆవేదనను ఫోటో ద్వారా వ్యక్తం చేశారు.
కాగా, ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పాపకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. పెంపుడు పిల్లిని కోల్పోయిన ఆ కుటుంబానికి సంతాప సందేశాలు పంపారు. ఒక పెంపుడు పిల్లిని ఉచితంగా ఇచ్చేందుకు ఒకరు ముందుకు వచ్చారు.