Srilanka President Gotabaya Rajapaksa | పీకల్లోతు ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయా రాజపక్స ఆచూకీ ఇప్పటికీ తెలియదు. అధ్యక్ష కార్యాలయం, అధికారిక నివాసంపై ఆందోళనకారులు దాడి చేసినప్పటి నుంచి గోటబయా రాజపక్స పరారయ్యారు. కానీ దేశానికి వచ్చిన 3700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ను సజావుగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
ముడి చమురు సహా ఆహార ఉత్పత్తులు, నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడానికి సరిపడా డాలర్లు లేక.. వాటి ధరలు భగభగమండుతున్నాయి. ఫలితంగా నెలల తరబడి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. గ్యాస్ కొరత సమస్య పరిష్కరించాలని లంక వాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కేరవాలపితియాకు వచ్చిన తొలి నౌక నుంచి గ్యాస్ అన్లోడ్ చేసి, సజావుగా పంపిణీ చేయాలని అధికారులను గోటబయా ఆదేశించారు. రెండో నౌక ఈ నెల 11న 3,740 మెట్రిక్ టన్నులు, మూడో నౌక 15న 3200 మెట్రిక్ టన్నుల గ్యాస్తో శ్రీలంకకు రానున్నది.
ఏడు దశాబ్దాల తర్వాత 2.2 కోట్ల మంది జనాభా గల శ్రీలంక అసాధారణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు సరిపడా లేక చమురు, ఇతర నిత్యావసరాల దిగుమతి కోసం అల్లాడిపోతున్నది శ్రీలంక. విదేశీ రుణాలు మొత్తం 51 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడు బిలియన్ డాలర్ల రుణ బకాయిల చెల్లింపులు తాత్కాలికంగా నిలిపేసింది.