కీవ్, అక్టోబర్ 10: ఉక్రెయిన్పై రష్యా సోమవారం మరోసారి క్షిపణి దాడులతో విరుచుకుపడింది. రాజధాని కీవ్తో సహా పలు ఇతర నగరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్, జైటోమిర్, ఖెల్నిట్సీ, డెనిప్రో, ల్వీవ్, టెర్నోపిల్, ఖార్కీవ్ తదితర నగరాలపై రష్యా దాదాపు 84 క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే 41 క్షిపణులను నిర్వీర్యం చేశామని ఉక్రెయిన్ సైన్యం జనరల్ స్టాఫ్ పేర్కొన్నారు. మొత్తంగా 11 మంది మరణించగా, 60 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. జూన్ 26 తర్వాత కీవ్పై రష్యా దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా-క్రిమియాను కలిపే కీలకమైన కెర్చ్ వంతెన పేల్చివేతకు ఉక్రెయినే కారణమని ఆరోపిస్తున్న రష్యా.. అందుకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడింది. క్షిపణి దాడులకు కీవ్తో పాటు ఇతర నగరాల్లో నివాస భవనాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. పార్లమెంట్ భవన సమీపంలోనూ క్షిపణులు పడ్డాయి.
బ్రిడ్జి పేల్చివేతతో పాటు ఉక్రెయిన్ ఉగ్రవాద చర్యలకు స్పందగానే ఈ దాడులు చేసినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇంధన, సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేశామని రష్యా భద్రతా మండలి సభ్యులతో వర్చువల్గా జరిపిన సమావేశంలో తెలిపారు. రష్యాపై ఉక్రెయిన్ ఉగ్ర దాడులను కొనసాగిస్తే తమ స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని అన్నారు. కెర్చ్ వంతెన పేల్చివేతలో ఉక్రెయిన్ స్పెషల్ సర్వీసెస్ విభాగం హస్తమున్నదని పుతిన్ ఇప్పటికే ఆరోపించారు.
రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. రష్యా సేనలు డజన్ల సంఖ్యలో క్షిపణులతో దాడులకు పాల్పడిందని, ఇరాన్ డ్రోన్లను వినియోగించిందన్నారు. 10 నగరాల్లోని నివాసిత ప్రాంతాలు, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేసుకొన్నారని పేర్కొన్నారు. రష్యా మమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలని, ఉక్రెయిన్ను ఈ భూమిపై లేకుండా చేయాలని అనుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్లోని తాజా పరిస్థితుల నేపథ్యంలో కీవ్లోని భారత రాయబార కార్యాలయం ఆ దేశంలోని భారతీయులకు కీలక హెచ్చరికలు చేసింది. ఇతర ప్రాంతాల నుంచి ఉక్రెయిన్కు లేదా ఉక్రెయిన్లో అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. అధికారుల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నది. మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య తాజా ఉద్రిక్తలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. శత్రుత్వాన్ని వీడాలని, చర్చల ప్రక్రియకు తిరిగి వెళ్లాలని పిలుపునిచ్చింది.