న్యూయార్క్: ఇరాన్పై చేసిన దాడులకు అమెరికా రక్షణ శాఖ పేరు పెట్టింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ(Operation Epic Fury) చేపట్టినట్లు పేర్కొన్నది. రక్షణశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ తన ఎక్స్ అకౌంట్లో ఈ పోస్టు చేసింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని ట్యాగ్లైన్ రాసి అమెరికా జెండా ఎమోజీని పోస్టు చేసింది. ఇజ్రాయెల్తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా పేర్కొన్నది. శనివారం ఉదయం అకస్మాత్తుగా ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడలు చేసింది. సుప్రీం నేత ఖమేనీ నివాసం, ఆఫీసుపై క్షిపణి అటాక్ జరిగింది. అయితే గత ఏడాది ఇరాన్లోని అణ్వాయుధ కేంద్రాలపై కూడా అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడులకు ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
OPERATION EPIC FURY 🇺🇸
— Department of War 🇺🇸 (@DeptofWar) February 28, 2026
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు తెలుస్తోంది. డజన్ల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. డజన్ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించినట్లు నౌర్ న్యూస్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ను ఉద్దేశిస్తూ యావత్ పాలస్తీనాను టార్గెట్ చేసి క్షిపణులు ప్రయోగించినట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది. ఇరాన్కు చెందిన ఇంగ్లీష్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ తన కథనంలో సుమారు 75 క్షిపణుల వరకు ఇరాన్ వదిలినట్లు పేర్కొన్నది.
అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బహ్రెయిన్, అబూదాబీ, ఖతార్లో ఉన్న అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ ప్రదేశాల్లో ఇవాళ పేలుళ్లు జరిగాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ ఇవాళ తమ పౌరులను కోరింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. అయితే రెండు క్షిపణలను తిప్పికొట్టినట్లు ఇవాళ ఖతార్ ప్రకటించింది. తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన ఆ క్షిపణులను కూల్చినట్లు ఖతార్ అధికారులు చెప్పారు.