ఢాకా: బంగ్లాదేశ్లో మతఛాందసవాదులు రెచ్చిపోతున్నారు. తరచూ హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వసం చేస్తున్నారు. ఠాకూర్గావ్ జిల్లాలోని ధంతాలా, పారియా, చారుల్ యూనియన్లలో ఉన్న పురాతమనమైన కాళీ మాత ఆలయంతోపాటు మరో 11 దేవాలయాలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. ఆలయాల్లో ఉన్న 14 విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగిందని బాలియదంగీ పోలీస్ అధికారి ఖరుల్ ఆనమ్ తెలిపారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ ఆలయాలన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయని మరో అధికారి బిపుల్ కుమార్ వెల్లడించారు. క్షేత్రాలను పూర్తిగా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. హిందూ కమ్యూనిటీ ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదని, అదనపు రక్షణ కల్పిస్తామన్నారు.
కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ధంతాలా యూనియన్ పూజా ఉజ్జపోన్ కమిటీ కార్యదర్శి జ్యోతిర్మయ్ సింగ్ డిమాండ్ చేశారు.
గత 50 ఏండ్లుగా ఆలయాల్లో పూజాధికాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన న్యాయం చేయాలని అధికారులను కోరారు.