వాషింగ్టన్: ఒక మహిళ అనారోగ్యంతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత మేల్కొన్న ఆమె ఒక కాగితంపై ఏదో రాసింది. (After Death Woman Scribbles Text On Paper) ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని అరిజోనాలో ఈ సంఘటన జరిగింది. 2018లో టీనా హైన్స్ అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించించారు. సుమారు 27 నిమిషాల పాటు ఆ మహిళ గుండె కొట్టుకోకపోవడం, శరీరం నీలంగా మారడంతో ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
కాగా, లైఫ్ సపోర్ట్ వ్యవస్థపై ఉన్న ఆ మహిళ కొంతసేపటి తర్వాత మేల్కొంది. ఇది చూసి అక్కడున్న వారు షాకయ్యారు. చావు నుంచి బయటపడిన ఆ మహిళ రాసేందుకు పేపర్, పెన్ను కావాలని సైగలు చేసింది. వాటిని ఆమెకు ఇవ్వగా ఆ కాగితంపై ఏదో రాసింది. అయితే కాగితంపై రాసిన ఇంగ్లీష్ అక్షరాలు అస్పష్టంగా ఉన్నాయి.
మరోవైపు నలుగురు పిల్లలకు తల్లి అయిన ఆ మహిళ ‘రియల్’ అన్న సందేశాన్ని కాగితంపై రాసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నిమిషాలపాటు చనిపోయిన ఆమె స్వర్గానికి చేరుకుని జీసస్ను చూసినట్లు తమకు చెప్పిందని మీడియాతో అన్నారు. ఇది చాలా అద్భుతమని పేర్కొన్నారు. అనంతరం కొన్ని రోజులపాటు ఆసుపత్రితో చికిత్స పొందిన ఆమె ఆ తర్వాత డిశ్చార్జ్ అయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.