వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున తాము వైట్హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చిందని, అలా బయటికి వెళ్లిన తర్వాత అరగంటపాటు బాగా ఏడ్చానని అమెరికా మాజీ ప్రథమ మహిళ, మరో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా వెల్లడించారు. ది లైట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు. ఎనిమిదేండ్ల తర్వాత తాము ఇంటిని విడిచిపెట్టాల్సి రావడం చాలా బాధగా అనిపించిందని చెప్పారు.
వైట్ హౌస్తో తమకు ఎనిమిదేండ్ల అనుబంధం ఉన్నదని, అది తమ పిల్లలకు ఊహ తెలిసిన తర్వాత ఏకైక ఇల్లని, ఆ ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చిన రోజున చాలా ఉద్వేగానికి లోనయ్యానని మిచెల్ ఒబామా వివరించారు. మా పిల్లలు చికాగోను స్వస్థలంగా గుర్తుంచుకున్నా వారు అక్కడికంటే ఎక్కువ సమయం వైట్హౌస్లోనే గడిపారని తెలిపారు.
ఇంటితోపాటు ఆ ఇంట్లో తమతో కలిసి ఉన్న సిబ్బందిని కూడా తాము వదిలిపెట్టాల్సి రావడం చాలా బాధగా అనిపించిందని చెప్పారు. ‘ఆ రోజు నాలో కన్నీళ్లు, బావోద్వేగం ఉన్నాయి. వేదికపై కూర్చున్న మాకు ఎదురుగా ఉన్న స్క్రీన్పై మేము కనిపిస్తున్నాం. ఆ వేదికపై ఎలాంటి వైవిధ్యం లేదు. కళ లేదు. అమెరికా విశాల భావానికి ప్రతిబింబం లేదు’ అని మిచెల్ బావోద్వేగంతో వెల్లడించారు.
ఇంకా ఆమె కొనసాగిస్తూ.. ‘వేదికపై నుంచి విమానం దగ్గరకు వెళ్లాం. విమానం తలుపులు మూసివేయగానే నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. దాదాపు అరగంటపాటు నిర్విరామంగా ఏడ్చాను. ఎందుకంటే ఆ ఇంటితో మాకు ఎనిమిదేండ్ల అనుబంధం ఏర్పడింది’ అంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు.