లాస్ ఏంజిల్స్: సోషల్ మీడియా(Social Media)కు యువత బానిసలు అవుతున్నట్లు నమోదు అయిన కేసులో.. మెటా, యూట్యూబ్ సంస్థలకు అమెరికా కోర్టు భారీ జరిమానా వేసింది. చిన్నతనం నుంచి సోషల్ మీడియాకు బానిసైనట్లు ఓ మహిళ దాఖలు చేసిన కేసులో లాస్ ఏంజిల్స్ జ్యూరీ అసాధారణ తీర్పును వెలువరించింది. ఆ అమ్మాయికి రెండు కంపెనీలు కలిసి సుమారు 6 మిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. సోషల్ మీడియా కాంటెంట్ సిగరెట్ల తరహాలో యువతను బానిసలుగా మారుస్తున్నట్లు జ్యూరీ ఆరోపించింది. పిల్లలు, యువకులు సోషల్ మీడియా తప్ప మరో ప్రపంచాన్ని గ్రహించలేకపోతున్నట్లు జ్యూరీ చెప్పింది. సోషల్ మీడియా వల్ల వ్యక్తిగతంగా మనుషులు నష్టపోతున్నారని పేర్కొన్నది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కంపెనీ యజమానులు.. పిల్లల సంరక్షణ మరిచి తమ సోషల్మీడియా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు జ్యూరీ వెల్లడించింది.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ .. ప్రస్తుతం మెటా పరిధిలో ఉన్నాయి, ఇక యూట్యూబ్ మాత్రం గూగుల్ ఆధీనంలో ఉన్నది. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అన్నీ యువతను ఆకర్షించే రీతిలో తమ ప్రోగ్రామింగ్ను తయారు చేసుకున్నట్లు జ్యూరీ పేర్కొన్నది. అడిక్షన్ కేసులో 20 ఏళ్ల అమ్మాయి మానసిక ఆరోగ్యాన్ని సోషల్ మీడియా దెబ్బతీసినట్లు జ్యూరీ వెల్లడించింది. కాలే అనే అమ్మాయికి 6 మిలియన్ల డాలర్లు చెల్లించాలని జ్యూరీ సభ్యులు ఆదేశించారు. అయితే ఇలాంటి మీడియా అడిక్షన్ కేసులు ప్రస్తుతం అమెరికా కోర్టుల్లో కొన్ని వందల సంఖ్యల్లో ఉన్నాయి. తాజా తీర్పుతో ఆ కేసులకు ఊతం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు అంటున్నారు.
జ్యూరీ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు మెటా, గూగల్ సంస్థలు పేర్కొన్నాయి. టీనేజీ యువత మానసిక ఆరోగ్యం చాలా సంక్లిష్టంగా ఉంటుందని, ఒకే ఒక్క యాప్తో అవన్నీ లింకు పెట్టడం సరికాదు అని ఆ సంస్థలు వాదించాయి. గూగుల్ ప్రతినిధి మాట్లాడుతూ యూట్యూబ్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని, యూట్యూబ్ అనేది స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ అని, అదేమీ సోషల్ మీడియా సైట్ కాదు అని పేర్కొన్నారు. కాలే అమ్మాయి కేసులో మెటా సంస్థ 70 శాతం, గూగల్ సంస్థ 30 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.