బెర్లిన్: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) పది లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎస్యూవీ సిరీస్లోని పలు మోడల్ కార్ల బ్రెకింగ్ సిస్టమ్లో సమస్యలు తలెత్తాయని సంస్థ తెలిపింది. 2004 నుంచి 2015 వరకు తయారైన ఎస్యూవీ సిరీస్లోని ఎంఎల్, జీఎల్, ఆర్-క్లాస్ లగ్జరీ మినివ్యాన్ మోడళ్లలో బ్రేక్ పెడల్ తుప్పు పట్టిపోయాయని, దీంతో బ్రేకింగ్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని గుర్తించామని పేర్కొన్నది.
అందువల్ల ఈ మూడు మోడళ్లకు చెందిన పది లక్షల కార్లను వెనక్కి ఇచ్చేయాలని ఆయా కార్ల యజమానులకు సూచించామని, లోపాలను సరిచేసి తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించింది. మొత్తం 9,93,407 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో జర్మనీలోనే 70 వేల కార్లు ఉన్నాయని పేర్కొన్నది.