కీవ్: ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి చందన్ జిందాల్ (22) బుధవారం మరణించారు. అతడి స్వస్థలం పంజాబ్. చదువుకోసం ఉక్రెయిన్కు వెళ్లిన అతడికి దాదాపు నెల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడి బాగోగులు చూసుకోవడానికి చందన్ తండ్రి కొద్ది రోజుల కిందట ఉక్రెయిన్కు వెళ్లారు. అయితే చికిత్స పొందుతూ కుమారుడు మరణించడంతో ఆ తండ్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కుమారుడి మృతదేహాన్ని ఎలా భారత్కు తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. మృతదేహాన్ని రుమేనియా సరిహద్దు వరకు తీసుకెళ్లగలిగితే అక్కడి నుంచి స్వదేశానికి వెళ్లొచ్చని.. ఇందుకు సాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని వేడుకుంటున్నారు. అయితే, అనారోగ్య కారణాలతోనే చందన్ మృతి చెందాడని, దాడుల వల్ల కాదని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ 17 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ వీడినట్టు పేర్కొంది.