సిటీబ్యూరో హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే నమోదవుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దవాఖానల్లో చేరికలు పెద్దగా లేవని అంటున్నారు. ఒమిక్రాన్లో స్వల్ప లక్షణాలు ఉండటం, వైరస్ కేవలం శ్వాస వ్యవస్థ పైభాగం మీదనే ప్రభావం చూపడంతో శ్వాస సమస్య ఏర్పడటం లేదని, ఫలితంగా రోగులకు ఆక్సిజన్ అవసరం కూడా పెద్దగా రాదని అభిప్రాయపడుతున్నారు. డెల్టా వేరియంట్లో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, శ్వాససమస్య, ఆయాసం, రుచి, వాసన కోల్పోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయని, అదే ఒమిక్రాన్లో అయితే కేవలం జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, గొంతు మారడం వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన సమాచారంతో ఈ సంగతి అవగతమవుతున్నట్టు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ స్పష్టంచేశారు.
80 శాతానికి పైగా స్వల్ప లక్షణాల బాధితులే
నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా రోగుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. స్వల్ప లక్షణాలతో కూడిన కేసులను ఒమిక్రాన్గా పరిగణించవచ్చంటున్నారు. తీవ్ర లక్షణాలు ఎదుర్కొనే రోగులు డెల్టాతో బాధపడుతున్నట్టు అనుమానించాల్సి ఉంటుందని అంటున్నారు.
లక్షణాలు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి
ప్రస్తుతం గాంధీలో 173 మంది కరోనా రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపు 169 మంది ఒమిక్రాన్ రోగులు కాగా, నలుగురిలో డెల్టా లక్షణాలు కనిపిస్తున్నాయి. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్కు పంపాం. గాంధీలో చేరుతున్న కరోనా రోగుల్లో 90 శాతానికి పైగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. వేర్వేరు అనారోగ్య సమస్యలతో ఆయా దవాఖానల్లో చేరి, కరోనా బారిన పడుతూ గాంధీలో చేరుతున్నారు. 3 – 5 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఒమిక్రాన్ వేరియంట్ అయితే 90 శాతం మందిలో 3- 5 రోజుల్లోపు లక్షణాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. కానీ డెల్టా సోకినవారిలో అలా జరగదు. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది.
-డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్,
గాంధీ హాస్పిటల్