న్యూఢిల్లీ, మార్చి 31: ఇరాన్లోని కీలక అణు కేంద్రమైన ఇస్ఫహాన్లోని ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడితో పట్టణంలో భారీ పేలుళ్లు సంభవించాయి. 900 కిలోల ముందుగుండుతో ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులు లోతైన భూగర్భంలో ఉన్న అణు ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని పేలుడు సృష్టించాయని అమెరికన్ అధికారి ఒకరు పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్లోని ఆయుధ డిపోపై జరిగిన దాడి దృశ్యాల వీడియోను తన ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. వరుస పేలుళ్లు, భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి.
ఈ వీడియోకు సంబంధించిన వివరాలేవీ ట్రంప్ వెల్లడించనప్పటికీ 23 లక్షల మంది జనాభా గల ఇస్ఫహాన్ పట్టణంలోని ఆయుధాల డిపోపై అమెరికా-ఇజ్రాయెలీ దళాలు దాడులు జరిపినట్లు మీడియా కథనాలు తెలిపాయి. కాగా, హొర్ముజ్ జలసంధిలోని ఇరాన్కు చెందిన ఖేష్మ్ దీవిలోని ఉప్పు నీటి శుద్ధీకరణ ప్లాంటు(డీశాలినేషన్)పై మంగళవారం వైమానిక దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఈ దాడి కారణంగా ప్లాంటు పూర్తిగా పనికిరాకుండా పోయినట్లు మీడియా పేర్కొన్నది. ఈ నీటి శుద్ధి ప్లాంటు పూర్తిగా పనిచేయడం లేదని, ఇప్పట్లో దీన్ని మరమ్మతు చేయడం కూడా సాధ్యం కాదని ఇస్నా వార్తా సంస్థ తెలిపింది.
కాగా, డీశాలినేషన్ సదుపాయంపై దాడులు చేయడం పశ్చిమాసియా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. ప్రపంచంలోనే అత్యధిక ఎడారి ప్రాంతమైన గల్ఫ్లోని ప్రజల దాహార్తిని ఈ డీశాలినేషన ప్లాంట్లే తీరుస్తున్నాయి. యూఏఈలో 42%, సౌదీలో 70%, ఒమన్లో 86%, కువైట్లో 90% ప్రజలు మంచినీటి కోసం డీశాలినేషన్ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నట్లు 2022 నాటి ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేర్కొన్నది. ఇరాన్పై దాడులు ఉధృతం చేస్తామని సోమవారం హెచ్చరించిన ట్రంప్ చమురు, విద్యుచ్ఛక్తి సదుపాయాలతోపాటు డీశాలినేషన్ ప్లాంట్లను కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరించిన మరుసటిరోజే ఖేష్మ్ దీవిలోని డీశాలినేషన్ ప్లాంటుపై దాడి జరగడం గమనార్హం.
ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికాకు చెందిన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలపై ఏప్రిల్ 1 నుంచి (బుధవారం) దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ సహా 18 కంపెనీల పేర్లను ఐఆర్జీసీ పేర్కొంటూ ఈ కంపెనీల ప్రాంతీయ కార్యకలాపాలను స్తంభింపచేస్తామని హెచ్చరించింది. ఇరాన్లో జరిగిన ప్రతి ఉగ్ర చర్యకూ సంబంధిత కంపెనీల యూనిట్లు విధ్వంసాన్ని ఎదుర్కోవలసిందేనని తెలిపింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి(టెహ్రాన్ కాలమానం) దాడులు ప్రారంభమవుతాయని ఐఆర్జీసీ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
భారత్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా ఉన్న టెహ్రాన్లో రాత్రి 8 గంటలంటే భారత్లో అది రాత్రి 10 గంటల సమయం. ఇకపై లక్ష్యాలను రూపొందించడంలో, వేటాడటంలో ప్రధాన అంశం అమెరికన్, ఐసీటీ, ఏఐ కంపెనీలే కాబట్టి ఈ ప్రధాన సంస్థలే మన చట్టబద్ధమైన లక్ష్యాలు అవుతాయి అని తస్నీం న్యూస్ ద్వారా వెలువడిన ప్రకటనలో ఐఆర్జీసీ పేర్కొన్నది. తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే తమ కార్యాలయాలను వీడి వెళ్లిపోవాలని ఈ సంస్థల ఉద్యోగులను కూడా ఐఆర్జీసీ హెచ్చరించింది. మరోవైపు, గల్ఫ్, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను కొనసాగించింది.