María Corina Machad : నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తుందని ఆశించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు చుక్కెదురైన విషయం తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ గొప్పలకు పోయిన ట్రంప్ను నోబెల్ అవార్డుల కమిటీ మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. దాంతో.. రాజకీయాల వల్లనే తమ అధినేతకు శాంతి పురస్కారం దక్కలేదని శ్వేత సౌధం కార్యాలయం ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలో మరియా కొరీనా మచాడో (María Corina Machad) తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్నకు అంకితమిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వెనెజువెలా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో (María Corina Machad)కు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) దక్కింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. అయితే.. ఆమె తనకు దక్కిన ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడికి అంకతమివ్వాలని నిర్ణయించుకున్నారు. ‘నాకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని వెనెజువెలాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, మాకు మద్దతుగా నిలుస్తున్న ట్రంప్నకు అంకితమిస్తున్నా’ అని ఎక్స్ వేదికగా మరియా వెల్లడించారు.
This recognition of the struggle of all Venezuelans is a boost to conclude our task: to conquer Freedom.
We are on the threshold of victory and today, more than ever, we count on President Trump, the people of the United States, the peoples of Latin America, and the democratic…
— María Corina Machado (@MariaCorinaYA) October 10, 2025
‘వెనెజువెలా దేశస్తుల పోరాటానికి దక్కిన గుర్తింపు ఇది. మన సమస్యలకు ముగింపు పలికేందుకు.. మనం స్వేచ్ఛను పొందడానికి ఈ అవార్డు ఎంతో ప్రేరణిస్తుంది. ఈరోజు మనం విజయానికి చేరువలో ఉన్నాం. అంతకంటే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశస్థులు, లాటిన్ అమెరికా ప్రజలతో పాటు ప్రజాస్వామిక దేశాలు మనం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని సాధించేందుకు మద్దతు పలుకుతున్నాయి. అందుకే.. నాకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని వెనిజులాలో పోరాడుతున్న ప్రజలకు, మాకోసం నిలబడుతున్న ట్రంప్నకు అంకితమిస్తున్నా’ అని మరియా తన పోస్ట్లో పేర్కొన్నారు.