Octopus | ఏదైనా మాంసాహారం తినేటప్పుడు పొరపాటున ఓ ముక్క గొంతులో ఇరుక్కుంటే ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. కక్క లేక, మింగలేక అన్నట్టు తయారువుతుంది మన పరిస్థితి. ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓ వ్యక్తి కూడా డిన్నర్లో నాన్ వెజ్ తిన్న తర్వాత గొంతు నొప్పిగా అనిపించింది. దీంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా, ఆక్టోపస్ ఇరుక్కున్నట్లు నిర్ధారించారు. ఈ ఘటన సింగపూర్లో 2018లో చోటు చేసుకోగా, ఇటీవల క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ జర్నల్లో ప్రచురితమైంది.
సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి.. 2018లో ఓ పార్టీలో భాగంగా డిన్నర్కు అటెండ్ అయ్యాడు. అక్కడ నాన్ వెజ్ కుమ్మేశాడు. కాసేపటికే అతని గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు, నొప్పిగా అనిపించింది. తీవ్ర అయాసం కావడంతో చేసేదేమీ లేక, స్థానికంగా ఉన్న టాన్ టాక్ సెంగ్ హాస్పిటల్కు వెళ్లాడు.
హాస్పిటల్ వైద్యులు బాధిత వ్యక్తికి సీటీ స్కాన్తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. అతని ఆహార వాహికలో ఏదో ఒక పదార్థం ఉన్నట్టు నిర్ధారించారు. అది 5 సెంటిమీటర్ల పొడవున్నట్లు గుర్తించారు. దీంతో బాధిత వ్యక్తికి సర్జరీ నిర్వహించి ఆ పదార్థాన్ని తొలగించారు. దాన్ని బయటకు తీసిన తర్వాత వైద్యులు షాక్ అయ్యారు. ఆ వ్యక్తి మింగింది ఆక్టోపస్ను అని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు హాస్పిటల్లో ఉండి, డిశ్చార్జి అయ్యాడు.