టోంగా దీవిలో వచ్చిన భారీ తుఫానులో సముద్రంలోకి కొట్టుకుపోయిన అతను.. 27 గంటలపాటు సముద్రంలో ఈదుతూ, తుఫాను అలలకు ఎదురొడ్డి నిలిచాడు. అతని కథ నెట్టింట వైరల్ అవడంతో నెటిజన్లు అతన్ని ‘ఆక్వామాన్’ (సూపర్ హీరో) అని పిలుస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టోంగా ద్వీపదేశంపై సముద్రం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఆటాటా దీవిలో నివసించే లిసాలా ఫోలా అనే 57 ఏళ్ల వ్యక్తి తన ఇంటికి రంగులు వేసుకుంటుండగా సునామీ వచ్చింది. సముద్రపు నీటి ధాటికి లిసాలా ఆ నీటిలో కొట్టుకుపోయాడు. అతనికి కాళ్లు సరిగా పనిచేయవు కూడా.
వేగంగా నడవలేడు. దీంతో భయపడిన అతను ఒక చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన మరో అలకు ఆ చెట్టు కూలిపోయింది. అతను సముద్రంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో నీటిపై తేలుతూ మునిగిపోకుండా ఉండేందుకు ప్రయత్నించానని లిసాలా తెలిపాడు.
అలా సునామీ అలల మధ్య తేలుతూ 27 గంటలపాటు ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ నీటిలోనే ఈదుకుంటూ ప్రధాన దీవిని చేరుకున్నాడు. అతని కథ బయటకు రావడంతో కాళ్లు సరిగా లేకపోయినా 27 గంటలపాటు సముద్రంలో ఈదిన అతన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అతన్ని ‘ఆక్వామాన్’ అంటూ కొనియాడుతున్నారు. అతను ప్రాణాలతో బయట పడినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.