Maldives-China | భారత్-మాల్దీవుల మధ్య దౌత్య వివాదం ముదురుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో దౌత్య వివాదం చెలరేగింది. మోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ.. మాల్దీవులకు వందల మంది భారతీయులు తమ విమాన టికెట్ల రిజర్వేషన్ రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మంగళవారం చైనాలోని ఫుజియాన్ రాష్ట్ర పరిధిలో జరిగిన మాల్దీవుల బిజినెస్ ఫోరం సదస్సులో మాట్లాడుతూ తమ దేశానికి మరింత మంది పర్యాటకులను పంపేందుకు చర్యలు చేపట్టాలని చైనాను కోరారు. చైనా తమకు అత్యంత మిత్ర దేశం అని ముయిజ్జు వ్యాఖ్యానించారు. `మా అత్యంత మిత్ర దేశాలు, అభివృద్ధి భాగస్వాముల్లో చైనా ఒకటి` అని చెప్పారు. 2014లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టులను ప్రశంసించారు. బీఆర్ఐ ప్రాజెక్టులతో మాల్దీవుల చరిత్రలోనే అత్యంత గణనీయ మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టారని పేర్కొన్నారు.
కొవిడ్-19కి ముందు మా నంబర్ వన్ మార్కెట్ చైనా అని మహ్మద్ ముయిజ్జు చెప్పారు. మళ్లీ చైనాను ఆ స్థానానికి తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నాలు ముమ్మురం చేయాల్సి ఉందన్నారు. మాల్దీవులలో సమగ్ర పర్యాటక జోన్ అభివృద్ధి చేసేందుకు 50 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
మాల్దీవులతో దౌత్య వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి భారతీయులు బాసటగా నిలిచి తమ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం రోజూ 300-400 మంది పర్యాటకులు మాల్దీవులకు విమాన టికెట్ల రిజర్వేషన్లను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. గతంలో ప్రతి రోజూ ఎనిమిది విమాన సర్వీసుల్లో 1200-1300 మంది ప్రయాణికులు భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే వారని ట్రావెల్ సర్వీస్ పోర్టల్ బ్లూ స్టార్ ఎయిర్ ట్రావెల్ సర్వీసెస్ ప్రతినిధి మాధవ్ ఓజా చెప్పారు. తాజా వివాదంతో సుమారు 20-30 శాతం మంది తమ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దీనివల్ల మాల్దీవులతో భారతీయ విమానయాన సంస్థల బిజినెస్ మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది.