Maldives | మాలే : భారత్-మాల్దీవుల మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రమవుతున్నది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మాయిజ్జు చైనా పర్యటన తర్వాత భారత్పై తన వ్యతిరేకతను మరింత పెంచారు. తమ దేశంలో ఉన్న 88 మంది భారత సైనికులు మార్చి 15 నాటికి తిరిగి వెళ్లిపోవాలని గడువు విధించారు. మాల్దీవుల ప్రెసిడెంట్స్ ఆఫీస్లో ప్రభుత్వ విధానాల విభాగం కార్యదర్శి నజీమ్ ఇబ్రహీం మాట్లాడుతూ, భారత సైనికులు మాల్దీవుల్లో ఇక కొనసాగకూడదన్నారు. ఇది మాల్దీవుల ప్రభుత్వ విధానమన్నారు.
మాలే మేయర్ ఎన్నికల్లో భారత్ అనుకూల అభ్యర్థి గెలుపు భారత్కు వ్యతిరేకంగా.. చైనాతో దోస్తీ మొదలుపెట్టిన మాల్దీవుల అధ్యక్షుడికి గట్టి షాక్ తగిలింది. రాజధాని మాలే మేయర్ ఎన్నికల్లో భారత్ అనుకూల ‘మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ’ (ఎండీపీ) ఘన విజయం సాధించింది. ఎండీపీ అభ్యర్థి అదామ్ ఆజిం కొత్త మేయర్గా ఎన్నికయ్యారని స్థానిక మీడియా పేర్కొన్నది. ఇంతకు ముందు నగర మేయర్గా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు మాయిజ్జు, గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు మేయర్ పదవికి రాజీనామా చేశారు. మాల్దీవులు-భారత్ సంబంధాలు ఉద్రిక్తంగా మారినవేళ అధ్యక్షుడు మాయిజ్జుకు వ్యతిరేకంగా మాలే మేయర్ ఫలితాలు వెలువడటం గమనార్హం.