మాలే: భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు. దేశ రాజ్యాంగం ప్రకారం ఏటా జరిగే మొదటి పార్లమెంటరీ సెషన్లో అధ్యక్షుడు ప్రసంగించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ముయిజ్జు మాట్లాడనున్నారు. అయితే ఆయన ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమొక్రాట్స్ బహిష్కరించాలని నిర్ణయించాయి.
అయితే బహిష్కరణకు గల కారణాలను మాల్దీవియన్ డెమొక్రటిక్స్ పార్టీ (MDP) వెల్లడించలేదు. పార్లమెంటు తిరస్కరించిన ముగ్గురు మంత్రులను తిరిగి నియమించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న డెమొక్రాట్లు అధ్యక్షుడి ప్రసంగానికి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ముయిజ్జు అవలంభిస్తున్న భారత వ్యతిరేక వైఖరిపై ఇటీవల రెండు ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. కాగా, చైనాలో పర్యటించిన ముయిజ్జు.. అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం తర్వాత తన భారత వ్యతిరేక విధానాలను మరింత గట్టిగా వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా మాల్దీవుల్లో ఉన్న 80 మంది భారత సైనికులను 60 రోజుల్లో ఉపసంహిరించుకోవాలని డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే.
కాగా, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముయిజ్జుపై ఆ దేశ విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు అవసరమైన సంతకాలను ఎండీపీ ఇప్పటికే సేకరించింది. ముయిజ్జు ఎంపిక చేసిన మంత్రి మండలిని ఆమోదించేందుకు ఇటీవల సమావేశమైన పార్లమెంటు అధికార, విపక్ష ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో అట్టుడికిన విషయం తెలిసిందే.
ఇక, మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై ఇటీవల మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, డెమొక్రాట్స్ పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్, చైనా తమ వ్యూహాత్మ ప్రాధాన్యపై దృష్టి పెట్టింది. మాల్దీవుల మంత్రులు, లక్షద్వీప్ విషయంలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి.