టెక్సాస్: ఇటీవల వర్జిన్ గెలాక్టిక్ రాకెట్లో గుంటూరు అమ్మాయి బండ్ల శిరీష్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో భారతీయురాలు అంతరిక్ష ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తోంది. మహారాష్ట్రకు చెందిన సంజల్ గవాండే.. బ్లూ ఆర్జిన్ కంపెనీలో సిస్టమ్ ఇంజినీరగా చేస్తోంది. ఈ నెల 20వ తేదీన జెఫ్ బేజోస్కు చెందిన బ్లూ ఆర్జిన్ సంస్థ నింగిలోకి రాకెట్ను పంపిస్తున్నది. న్యూ షెప్హార్డ్ రాకెట్లో బేజోస్ రోదసిలోకి వెళ్లి రానున్నారు.
బ్లూ ఆర్జిన్ డెవలప్ చేసిన రాకెట్ బృందంలో 30 ఏళ్ల మరాఠీ మహిళ సంజల్ కూడా ఉంది. ముంబై సమీపంలో ఉన్న కళ్యాణ్లో సంజల్ పుట్టింది. చిన్నతనంలోనే స్పేస్షిప్ను నిర్మించాలన్న కలలు కన్నదామె. చిన్ననాటి స్వప్నం నిజం అవుతుందన్న సంతోషం తనలో ఉన్నట్లు సంజల్ చెప్పింది. టీమ్ బ్లూ ఆర్జిన్లో సభ్యురాల్ని కావడం గర్వంగా ఫీలవుతున్నట్లు ఆమె వెల్లడించింది.
కళ్యాణ్ మున్సిపాల్టీలో పనిచేసిన రిటైర్డ్ ద్యోగి అశోక్ గవాండే కూతురే సంజల్ గవాండే. ఆమె తల్లి సురేఖ కూడా ఉద్యోగస్తురాలు. ఎంటీఎన్ఎల్లో పనిచేసిన రిటైర్ అయ్యారు. చిన్నతనం నుంచే తన కూతురికి అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్నట్లు తల్లి సురేఖ తెలిపారు. ముంబై వర్సిటీలో సంజల్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్టర్స్ కోసం ఆమె మిచిగన్ టెక్నాలాజికల్ వర్సిటీలో చేరింది. విస్కాన్సిన్లో ఆమె మెర్క్యూరీ మెరైన్లో ఉద్యోగం చేసింది. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ సిటీలో ఉన్న టొయోటా రేసింగ్ డెవలప్మెంట్లోనూ పనిచేసినట్లు సంజల్ తండ్రి తెలిపారు.
2016లో సంజల్కు పైలెట్ లైసెన్సు వచ్చింది. ఆ తర్వాత ఆమె నాసాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నది. కానీ పౌరసత్వ సమస్యల వల్ల ఆమె ఎంపిక కాలేదు. కానీ ఆమెలో ఆత్మవిశ్వసం సడలలేదు. బ్లూ ఆర్జిన్లో ఆమె ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ కంపెనీలో సిస్టమ్స్ ఇంజినీర్గా జాబ్ కొట్టింది. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లను డిజైన్ చేయాలన్ని తపన ఆమెతో ఉండేదని తల్లి చెప్పింది.