కరాచీ: అది అత్యంత ఖరీదైన బెంట్లీ మల్సన్నే సెడాన్ లగ్జరీ కారు. దాని విలువ మూడు లక్షల అమెరికన్ డాలర్లకు పైమాటే. అదే మన కరెన్సీలో సుమారు రూ.2.3 కోట్లు. లండన్లో ఆ కారును దుండగులు కొన్ని వారాల క్రితం ఎత్తుకెళ్లారు. తీరా చూస్తే అది పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న ఓ పోష్ ఇంట్లో దొరికింది. లండన్లో మాయమైన కారు కరాచీలో ఎలా దొరికిందనుకుంటున్నారా.. బెంట్లీ కారులో ఓ ట్రాకర్ ఉంది. కారును ఎత్తుకెళ్లిన దుండగులుగాని, వాడుతున్న వ్యక్తిగాని ట్రాకర్ను ఆఫ్ చేయడమో లేదా దానిని తొలగించడమో చేయలేదు. యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ట్రాకర్ సాయంతో ఆ బెంట్లీ కారు ప్రస్తుతం కరాచీలో ఉందని గుర్తించారు. వెంటనే పాకిస్థాన్ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కరాచీలోని డీహెచ్ఏ అనే పోష్ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంట్లీ కారును గుర్తించారు. అయితే అది పాకిస్థాన్ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉంది. ఈనేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కారు ఛాసిస్ నంబర్ చూడగా.. అది యూకే క్రైమ్ ఏజెన్సీ ఇచ్చిన నంబర్తో సరిపోలింది. దీంతో దానిని సీజ్ చేశారు. కారును అమ్మిన మధ్యవర్తిని, కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ఖరీదైన కారును దొంగతనంగా దేశంలోకి తీసుకురావడంతో తాము రూ.300 మిలియన్లు (పాక్ కరెన్సీలో) నష్టపోయామని పాక్ కస్టమ్స్ అధికారులు వాపోయారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడో లండన్లో మాయమైన లగ్జరీ కారు కరాచీలో గుర్తించడంతో.. అంతా ఆర్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా నడిపిన వారిని గుర్తించే దిశగా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.